Love: మరికాసేపట్లో పెళ్లనగా... మండపంపై ప్రత్యక్షమైన ప్రియురాలు... వరుడిపై రేప్ కేసు!

  • ప్రేమ పేరిట సహజీవనం చేసిన నరేష్
  • మరో వివాహానికి సిద్ధం
  • విషయం తెలిసి పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

ఇంకొన్ని గంటల్లో పెళ్లనగా, వరుడు తనకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడంటూ, ఓ యువతి మండపం ముందు పోలీసులతో సహా ప్రత్యక్షమై, పెళ్లిని ఆపించడంతో పాటు, వరుడిపై లైంగిక దాడి కేసు పెట్టింది. హైదరాబాద్, బంజారాహిల్స్ లో జరిగిన ఘటన వెనుక పూర్వపరాల్లోకి వెళితే, నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువతి హెరిటేజ్ సూపర్ మార్కెట్లో పనిచేస్తూ, ఇందిరానగర్ లో ఉంటుండగా, ఆమెకు నరేష్ అనే యువకుడితో ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఆపై ఇద్దరూ కలసి ఒకే గదిలో సహజీవనం చేశారు. పెళ్లిని దాటవేస్తూ వచ్చిన నరేష్, ఓ మారు అమెకు అబార్షన్ కూడా చేయించాడు.

ఈ క్రమంలో ఇటీవల నరేష్ ఫోన్ లో ఓ యువతి ఫొటో ఆమెకు కనిపించింది. ఎవరని నిలదీయగా, తన సోదరి అని అబద్ధమాడాడు. అనుమానం వీడక ఆమె ఆరాతీయగా, 30వ తేదీ, గురువారం నాడు వారిద్దరికీ కరీంనగర్ లో వివాహం జరగనుందని తెలిసింది. దీంతో ఆమె బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించగా, ఎక్స్ ప్రెస్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, పెళ్లి జరిగే కల్యాణ మండపానికి వెళ్లారు. పెళ్లిని నిలిపివేయించి, నరేష్ పై పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు.

More Telugu News