Venkaiah Naidu: నోట్ల రద్దు పుణ్యమా అని బాత్రూముల్లో దాచుకున్న సొమ్మును కూడా బ్యాంకుల్లో జమచేశారు: వెంకయ్య నాయుడు

  • నోట్ల రద్దును సమర్థించిన ఉప రాష్ట్రపతి
  • దాచుకున్న సొమ్మంతా బ్యాంకుల్లో జమ చేశారని వ్యాఖ్య
  • నల్లధనం వెలికితీత నోట్ల రద్దు లక్ష్యం కాదన్న జైట్లీ

నోట్ల రద్దు వల్ల మంచే జరిగిందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రద్దు కారణంగా బాత్రూముల్లో, బెడ్రూముల్లో దాచుకున్న సొమ్మును తిరిగి బ్యాంకుల్లో జమ చేశారని పేర్కొన్నారు. రద్దు చేసిన సొమ్ముంతా తిరిగి బ్యాంకుల్లోకి వచ్చిందని భారతీయ రిజర్వు బ్యాంకు చెప్పడం సంతోషకరమన్న ఆయన, అందులో నల్లధనం ఎంతో, తెల్లధనం ఎంతో ఆర్బీఐ, ఆదాయపన్నుశాఖ చూసుకుంటుందన్నారు. ఆ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. దాచుకున్న డబ్బంతా వెనక్కి రావడం మంచి పరిణామమేనంటూ నోట్ల రద్దును వెంకయ్య సమర్థించారు.

నోట్ల రద్దును మరోమారు గట్టిగా సమర్థించిన కేంద్రం.. నల్లధనాన్ని వెలికి తీసుకురావడమే నోట్ల రద్దు లక్ష్యం కాదన్నారు. ఈ నిర్ణయం వల్ల గతంలో పన్ను చెల్లించనివారు కూడా నేడు చెల్లిస్తున్నారని తెలిపింది. నోట్ల రద్దు తర్వాత ఈ రెండేళ్లలో ఆదాయపు పన్ను, కార్పొరేట్‌ పన్ను చెల్లింపులు పెద్ద మొత్తంలో జరిగాయని, దేశ ఆదాయం పెరిగి ఆర్థిక వృద్ధి నమోదైందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరించారు. నోట్ల రద్దు వల్ల డిజిటల్ లావాదేవీలు పెరిగాయని  నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

More Telugu News