Hyderabad: సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీ-తూఫాన్ ఢీ.. నలుగురి దుర్మరణం

  • శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఘోరం
  • వెనక నుంచి లారీని ఢీకొట్టిన వాహనం
  • బాధితులు హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ వాసులు

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని మద్దికుంట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వేగంగా వచ్చిన తూఫాన్ వాహనం లారీని వెనకనుంచి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఢీకొట్టిన వేగానికి తూఫాన్ వాహనం లారీ కింద ఇరుక్కుపోయింది. గమనించిన వాహనదారులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బాధితులను హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్‌కు చెందినవారిగా గుర్తించారు. కర్ణాటకలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాదానికి గురైన రెండు వాహనాలను కర్ణాటకకు చెందినవిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News