Telangana: కొత్త జోనల్ విధానాన్ని ఆమోదించిన కేంద్రం.. తెలంగాణలో 95 శాతం ఉద్యోగాలు ఇక స్థానికులకే!

  • గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం
  • కేసీఆర్ చొరవతో సమస్యకు త్వరితంగా పరిష్కారం 
  • ఉద్యోగ ఖాళీల జాబితా కోసం ఇప్పటికే సీఎస్ ఆదేశం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జోనల్ విధానానికి కేంద్రం ఈ రోజు ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్.. కొత్త జోనల్ విధానంపై కేంద్రం చెబుతున్న అభ్యంతరాలపై ప్రధాని నరేంద్ర మోదీకి వివరణ ఇచ్చారు. అంతేకాకుండా హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తోనూ కేసీఆర్ మాట్లాడారు. దీంతో కేంద్రం తెలంగాణ ప్రభుత్వ అభ్యర్ధనపై సానుకూలంగా స్పందించింది.

ఈ కొత్త జోనల్ వ్యవస్థ కింద ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే దక్కనున్నాయి. నూతన జోనల్ విధానంలో భాగంగా రాష్ట్రాన్ని ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లుగా విభజించారు. ఇందుకు అనుగుణంగా ఆయా జోన్లలో ఉన్న ఖాళీల జాబితాలను సిద్ధం చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి అధికారులను ఇప్పటికే ఆదేశించారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆమోదిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

కొత్త జోనల్ విధానంలో 95 శాతం పోస్టులను స్థానిక అభ్యర్థులకే కేటాయించనుండగా, మిగిలిన 5 శాతం పోస్టులను ఓపెన్ కేటగిరి అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. ఈ ఓపెన్ కేటగిరిలోనూ మిగతా తెలంగాణ జిల్లాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే పోటీ పడేందుకు వీలుంది. దీంతో అన్ని ఉద్యోగాలు కేవలం తెలంగాణ స్థానికత ఉన్నవారికే దక్కనున్నాయి. గతంలో జిల్లా స్థాయిలో 80 శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్ పోస్టులు ఉండేవి. అదే జోన్ల విషయానికి వస్తే ఈ నిష్పత్తి 70:30 గా ఉండేది.

More Telugu News