harikrishna: పూజ చేయకుండా షూటింగ్ మొదలుపెట్టిన హరికృష్ణ.. మహిళ ఒంట్లోకి వచ్చేసిన అమ్మవారు!: సముద్ర చెప్పిన సంగతులు

  • శివరామరాజు సెట్ లో ఘటన
  • ఓ మహిళ ఒంట్లోకి అమ్మవారు వచ్చేశారన్న సముద్ర
  • ఏం జరుగుతోందో తనకు అర్థం కాలేదని వెల్లడి

నందమూరి హరికృష్ణ బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని సినీ దర్శకుడు సముద్ర గుర్తుచేసుకున్నారు. శివరామరాజు సినిమాలో హరికృష్ణతో పనిచేయడం మరచిపోలేని అనుభవమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికరమైన ఘటనను ఆయన నందమూరి అభిమానులతో పంచుకున్నారు.

శివరామరాజు సినిమాలో భాగంగా ‘థిన్నకు థిన్నకు తా’ అనే పాటకు హరికృష్ణ నృత్యం చేయాల్సి ఉందని తెలిపారు. ఇందుకోసం హరికృష్ణ అమ్మవారి వస్త్రాలు వేసుకుని వచ్చి షూటింగ్ మొదలుపెట్టారని, అయితే అమ్మవారికి అభిషేకం చేయకుండానే షూటింగ్ మొదలుపెట్టడంతో ఆమెకు కోపం వచ్చందనీ, వెంటనే అమ్మవారు ఓ మహిళ ఒంట్లోకి వచ్చేశారని పేర్కొన్నారు.

అక్కడే ఉన్న తమకు ఏం జరుగుతోందో అస్సలు అర్థం కాలేదని సముద్ర అన్నారు. సదరు మహిళ ఒంట్లోకి వచ్చిన అమ్మవారు ‘ఏంట్రా.. నా బట్టలు వేసుకుని నాకే పూజ చేయకుండా నృత్యం చేస్తున్నావ్?’ అని హరికృష్ణపై అరిచారని వెల్లడించారు.

దీంతో హరికృష్ణ తనతో మాట్లాడుతూ.. ‘సముద్రా.. అమ్మవారికి మనం అభిషేకం చేయకుండా షూటింగ్ ప్రారంభించాం. ఈ వస్త్రాలు వేసుకుని పూజ చేయకుండా నేను షూటింగ్ మొదలుపెట్టానని అమ్మకు కోపం వచ్చింది’ అని చెప్పినట్లు సముద్ర అన్నారు. అనంతరం అమ్మవారికి పూజ, అభిషేకం పూర్తిచేశాక షూటింగ్ మొదలుపెట్టామని ఆయన చెప్పుకొచ్చారు.

More Telugu News