hari krishna: టీడీపీ అంటే ఆయనకు ప్రాణం.. పచ్చ చొక్కాతోనే నింగికెగసిన నేత!

  • ప్రతి రోజు పార్టీ కార్యాలయానికి రావడం హరికృష్ణకు ఆనవాయతీ
  • నేతలతో పార్టీ కార్యకలాపాలపై చర్చ
  • పార్టీ కార్యాలయం ప్రధాన గేటు నుంచి వచ్చే ఏకైక నేత హరికృష్ణ

తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో దివంగత హరికృష్ణ చురుకుగా పాల్గొనేవారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు ఎన్టీఆర్ భవన్ కు వచ్చి రెండు, మూడు గంటలు గడిపేవారు. అక్కడకు వచ్చే నేతలతో పార్టీ కార్యకలాపాలపై చర్చించేవారు. పొలిట్ బ్యూరో సమావేశాల్లో కూడా తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పేవారు. నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత హరికృష్ణతో ఎక్కువగా ముచ్చటించేవారు. పలు విషయాలపై లోకేష్ కు ఆయన సూచనలు, సలహాలు ఇచ్చేవారు. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు ఆయనే దగ్గరుండి పనులు చూసుకున్నారు.

ఎన్టీఆర్ భవన్ ప్రధాన గేటు గుండా చంద్రబాబు కాన్వాయ్ తో పాటు కేవలం హరికృష్ణ వాహనం మాత్రమే లోపలకు వచ్చేది. కార్యాలయం మెట్ల ముందు వరకు ఆయన వాహనం వచ్చి ఆగేది. పార్టీలో ఆయనకు ఉన్న ప్రాధాన్యత అటువంటిది. ఎక్కువగా ఆయన పసుపు చొక్కాలోనే కనిపించేవారు. చివరకు ప్రాణాలు కోల్పోయిన సమయంలో కూడా ఆయన ఒంటిపై పచ్చ చొక్కానే ఉంది. ప్రాణాలు పోయే సమయంలో కూడా పచ్చచొక్కాలోనే ఉన్నారంటూ పార్టీ నేతలు, అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు. 

More Telugu News