Harikrishna: ఎన్టీఆర్ తరువాత హరికృష్ణకు మాత్రమే తెలిసిన విషయమిది: నిమ్మకూరు వాసులు

  • తీవ్ర ఆవేదనలో నిమ్మకూరు వాసులు
  • గ్రామంలో ఎవరి ఇల్లు ఎక్కడుందో సర్వమూ తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్
  • ఆ తరువాత ఆ వివరాలు తెలిసింది హరికృష్ణకు మాత్రమే
  • విలపిస్తూ గుర్తు చేసుకుంటున్న గ్రామస్తులు

నిమ్మకూరు... నందమూరి వంశీకుల స్వగ్రామం. నేడు నందమూరి హరికృష్ణ హఠాన్మరణంతో నిమ్మకూరు వాసులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. హరికృష్ణతో తమకున్న సంబంధాన్ని గుర్తు చేసుకుని బోరున విలపిస్తున్నారు. నిమ్మకూరులోనే పెరిగి, అదే గ్రామానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్న హరికృష్ణ, తరచూ ఊరికి వచ్చి వెళుతుండేవారని గ్రామస్తులు చెబుతున్నారు.

నిమ్మకూరు అభివృద్ధిని గురించి అనునిత్యమూ తపనపడే ఆయన, ఎంపీగా ఉన్న వేళ, గ్రామంలో రోడ్లు, నీటి వసతి పనులకు నిధులు కేటాయించారని గుర్తు చేసుకున్నారు. గ్రామంలో ఎవరెవరు ఉంటున్నారు? ఎవరి ఇల్లు ఎక్కడుంది? ఎవరెవరు బంధువులు? తదితర విషయాలన్నీ ఎన్టీఆర్ కు బాగా తెలుసునని, ఆ తరువాత ఆ వివరాలన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి హరికృష్ణేనని, ఆయన మరణించారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని విషణ్ణ వదనంతో వ్యాఖ్యానించారు. కాగా, నిమ్మకూరులోని ఎన్టీఆర్ బంధుగణమంతా, హరికృష్ణ మరణవార్తను తెలుసుకుని హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు.

More Telugu News