Jakarta: జకార్తాలో సర్వర్‌గా మారిన భారత మంత్రి.. అథ్లెట్లకు ఆహారం సరఫరా!

  • క్రీడాకారులకు సూప్, టీ అందించిన మంత్రి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజ్యవర్థన్ ఫొటో
  • ఆసియాడ్‌లో 50కి చేరిన పతకాల సంఖ్య

ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ సర్వర్‌గా మారారు. వివిధ ఈవెంట్లలో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు సూప్, టీ, ఆహారం అందిస్తూ ప్రోత్సహించారు. గతంలో ఒలింపిక్ పతక విజేత అయిన మంత్రి ప్రస్తుతం జకార్తాలో ఉండి, క్రీడాకారులతో మాట్లాడుతూ వారిని ఉత్సాహపరుస్తున్నారు.

ఈ క్రమంలో వారికి బౌల్స్‌లో సూప్, టీ అందిస్తూ, ఆహార పదార్థాలు తీసుకెళ్తూ బిజీగా కనిపించారు. ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాకు చేరడంతో మంత్రిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ‘దేశం కోసం సర్వర్‌గా మారిన మంత్రి’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఆసియాడ్‌లో భారత పతకాల వేట కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో తెలుగుతేజం పీవీ సింధు త్రుటిలో స్వర్ణం కోల్పోయి రజతంతో సరిపెట్టుకోగా, 800 మీటర్ల పరుగులో భారత్‌కు స్వర్ణం, రజతం వచ్చాయి. అలాగే, టీటీలో, ఆర్చరీలోనూ భారత్ పతకాలు కొల్లగొట్టింది. దీంతో మంగళవారం నాటికి భారత్ సాధించిన పతకాల సంఖ్య 50కి చేరుకుంది.

More Telugu News