Crime News: ఆస్తి పంచివ్వలేదన్న అక్కసు.. తండ్రి కంటిని పీకేసిన కొడుకు!

  • ఆస్తి కోసం తండ్రితో వాదులాట
  • గొడవ పెట్టుకుని కంటిని పీకేసిన కొడుకు
  • పోలీసులకు అప్పగించిన ఇరుగుపొరుగువారు

మానవ సంబంధాలన్నీ డబ్బుపైనే ఆధారపడి ఉంటాయని నిరూపించే మరో ఘటన బెంగళూరులో జరిగింది. ఆస్తి ముందు పేగు బంధాలు, ప్రేమాప్యాయతలకు చోటు లేదని నిరూపించాడో పుత్రరత్నం. ఆస్తి పంచలేదన్న కోపంతో తండ్రి కంటినే పీకేశాడు. నగరంలోని శాకంబరినగర్‌లో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది.

పోలీసుల కథనం ప్రకారం.. పరమేశ్ (65), చేతన్ అభిషేక్ (35) తండ్రీ కొడుకులు. పరమేశ్ ఇటీవల ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైరయ్యాడు. కొన్ని నెలల క్రితం అతడి భార్య మరణించింది. దీంతో ఉన్న ఆస్తిని పంచివ్వాలని చేతన్ తన తండ్రిపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. అందుకాయన నిరాకరించడంతో మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తండ్రితో మరోమారు వాదులాటకు దిగాడు. ఆగ్రహంతో తండ్రి కంటిని పీకేసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే, బాధతో విలవిల్లాడుతూ పరమేశ్ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చేతన్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారొచ్చి అభిషేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. కన్ను కోల్పోయి విలవిల్లాడుతున్న వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారు.

More Telugu News