army major: కశ్మీరీ యువతిని హోటల్ కు తీసుకెళ్లిన ఆర్మీ మేజర్ పై విచారణకు ఆదేశాలు!

  • మేజర్ లీతుల్ గొగోయ్ పై విచారణకు ఆదేశాలు
  • మే 23న ఓ కశ్మీరీ యువతిని హోటల్ కు తీసుకెళ్లిన గొగోయ్
  • రహస్య సమావేశం నిమిత్తమే తీసుకెళ్లానన్న మేజర్

ఆర్మీ మేజర్ లీతుల్ గొగోయ్ పై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. కశ్మీరీ యువతిని హోటల్ కు తీసుకెళ్లిన ఘటనలో విచారణకు ఆర్మీ అధికారులు ఆదేశించారు. కేసు వివరాల్లోకి వెళ్తే, మే 23న శ్రీనగర్ లోని ఓ హోటల్ గదిని బుక్ చేసుకున్న గొగోయ్... తనతో పాటు ఓ కశ్మీరీ యువతిని తీసుకొచ్చారు. అయితే, ఆమె స్థానికురాలు కావడంతో, వారిద్దరూ కలసి హోటల్ గదిలోకి వెళ్లేందుకు హోటల్ సిబ్బంది అనుమతించలేదు. ఈ క్రమంలో గొగోయ్ కు, హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు వచ్చి గొగోయ్ ని అదుపులోకి తీసుకున్నారు. ఓ రహస్య సమావేశం నిమిత్తమే తాము ఇక్కడకు వచ్చినట్టు పోలీసులకు గొగోయ్ తెలిపారు.

ఈ నేపథ్యంలో, గొగోయ్ పై విచారణకు ఆర్మీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక, అతనిపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. గతంలో కూడా గొగోయ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. గత ఏడాది ఆందోళనకారుల నుంచి రక్షణలో భాగంగా... ఓ స్థానికుడిని జీపు ముందు కట్టేసి తీసుకువెళ్లి ఆయన వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆ సమయంలో ఆయనకు ఆర్మీ మద్దతుగా నిలిచింది.

More Telugu News