Vizag: విశాఖలో దారుణం... పెళ్లికి అంగీకరించలేదని ప్రియురాలిని కత్తితో పొడిచి పారిపోయిన ప్రియుడు!

  • రెండేళ్లుగా ప్రేమలో ఉన్న అనూష, సతీష్
  • ఉద్యోగం లేకపోవడంతో పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చిన అనూష
  • ఆగ్రహంతో దాడి చేసిన సతీష్

ప్రేమించానని చెప్పి, ఆపై పెళ్లికి నిరాకరిస్తున్న ప్రియురాలిపై కత్తితో దాడి చేసిన ఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది. ఆరిలోవ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఇక్కడి కనక మహాలక్ష్మీ నగర్ లో తన తల్లిదండ్రులతో కలసి అనూష (31) నివసిస్తుండగా, అదే ప్రాంతానికి చెందిన సతీష్ (32) ఆమెకు పరిచయం అయ్యాడు. వారిద్దరూ రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు.

గుజరాత్ లో క్రేన్ ఆపరేటర్ గా పనిచేసే సతీష్, ప్రస్తుతం ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాడు. తనను వివాహం చేసుకోవాలని అనూషను నిత్యమూ వేధిస్తుండగా, మరో ఉద్యోగంలో కుదురుకున్నాక పెళ్లి చేసుకుందామని ఆమె నచ్చజెపుతూ వచ్చింది. ఈ క్రమంలో శనివారం రాత్రి అనూషను కలిసిన సతీష్, మరోసారి పెళ్లి ప్రస్తావన తేగా, ఆమె నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సతీష్, ఆమె గుండెల్లో కత్తితో పొడిచి పరారయ్యాడు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న సతీష్ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News