Nellore District: పెళ్లయిన ఆరేళ్లకు గర్భం... తప్పు చేశావంటూ గెంటేసిన భర్త!

  • నెల్లూరు జిల్లా గూడూరులో ఘటన
  • స్నేహితుల విరాళాలతో చెల్లి పెళ్లి చేసిన షబ్బీరా
  • ఆరేళ్ల తరువాత గర్భం ఏంటంటూ నిలదీసిన భర్త

వివాహమైన ఆరు సంవత్సరాల తరువాత గర్భం ఎలా వచ్చిందని ప్రశ్నిస్తూ, నిండు చూలాలని కూడా చూడకుండా కొట్టి తరిమేశాడో భర్త. ఈ ఘటన నెల్లూరు జిల్లా గూడూరులో జరిగింది. ఇక్కడి గాంధీ నగర్ కు చెందిన ఖాదర్ బాషా, అనూ బేగంలకు షబీరా, దిల్ షాద్ అనే కుమార్తెలుండగా, తల్లిదండ్రుల మరణం తరువాత సోదరి దిల్ షాద్ కు స్నేహితుల సాయంతో ఆరేళ్ల క్రితం వివాహం జరిపించింది షబీరా.

ఆపై వారికి పిల్లలు కలగక పోవడంతో భర్త రఫీ, అత్తమామల నుంచి వేధింపులు ఎదుర్కొంది. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం ఆమె గర్భం దాల్చడంతో, ఇన్ని సంవత్సరాలు రాని గర్భం ఇప్పుడెలా వచ్చిందని నిలదీస్తూ, తప్పు చేశావంటూ, ఆమెను శారీరకంగా హింసించడం ప్రారంభించారు. మూడు రోజుల క్రితం ఆమెను కొట్టి ఇంటి నుంచి తరిమి వేయడంతో డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వస్తూ స్పృహ కోల్పోయింది. ఆమె స్థితిని గమనించిన బీట్ పోలీసులు, ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యలు తల్లీ, బిడ్డా క్షేమమని చెప్పగా, తన సోదరికి న్యాయం చేయాలంటూ షబ్బీరా పోలీసులను వేడుకుంటోంది.

More Telugu News