Telangana: గవర్నమెంట్ ఆసుపత్రిలో టీకొట్టు యజమాని చేస్తున్న చికిత్స.. వైరల్ గా మారుతున్న వీడియో!

  • మంచిర్యాల జిల్లాలో దారుణం
  • రోగులకు ఇంజెక్షన్ వేస్తున్న టీకొట్టు యజమాని
  • ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకుంటున్న ప్రభుత్వ వైద్యులు

ఓవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం మొత్తుకుంటుంటే.. మరోవైపు అక్కడి డాక్టర్లేమో పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటిదాకా ఆయాలు, అటెండర్ల చేత మాత్రమే రోగులకు చికిత్స అందించిన వైద్యులు ఇప్పుడు తాజాగా టీ కొట్టు యజమానిని కూడా ఆ జాబితాలో చేర్చారు.

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో లతీఫ్ అనే టీ కొట్టు యజమాని రోగులకు చికిత్స చేయడం కలకలం రేపుతోంది. ఆసుపత్రి ముందు టీకొట్టు నడుపుతున్న లతీఫ్ కు వైద్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రిని లతీఫ్ కు అప్పగించిన వైద్యులు చక్కగా తమ ప్రైవేటు ప్రాక్టీసును చేసుకోవడం మొదలుపెట్టారు.

దీంతో ఆసుపత్రిలో ఇతను ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. అక్కడి సిబ్బంది సైతం ఏం అనలేక సైలెంట్ గా పనిచేసుకుపోతున్నారు. అయితే లతీఫ్ రోగులకు ఇంజెక్షన్ ఇస్తున్న వీడియోను ఎవరో షూట్ చేసి మీడియాకు అందించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

More Telugu News