Krishna District: ప్రాణాంతకమైన వివాహేతర బంధం... బ్యూటీషియన్ చేతులు నరికిన కేసులో మరిన్ని నిజాలు!

  • 23వ తేదీన దాడి చేసిన ప్రియుడు
  • రెండు రోజులు అచేతనంగా పడివున్న పద్మ
  • ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య 

ఓ బ్యూటీషియన్ కాళ్లూ చేతులూ కట్టేసి, దారుణంగా చేతులు నరికి, ఒంటిపై కూడా కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసిన కేసులో పోలీసులు మరిన్ని నిజాలను వెల్లడించారు. ఈ కేసులో బాధితురాలు పల్లె పద్మ ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. 23వ తేదీన ఈ ఘటన జరుగగా, రెండు రోజుల తర్వాత విషయం వెలుగుచూసింది.

ఘటన జరిగిన తరువాత రెండు రోజుల పాటు ఆమె తీవ్ర రక్తస్రావంతో గదిలోనే పడుందని, దీంతో ఎంతో రక్తాన్ని ఆమె కోల్పోయిందని వైద్యులు వెల్లడించారు. 25వ తేదీన ఆమె భర్త సూర్యనారాయణ ఇంటికి వచ్చిన తరువాతనే పద్మపై దాడి గురించి బయటకు తెలిసిందని పోలీసులు వెల్లడించారు. రెండు రోజుల నుంచి పద్మ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో నిన్న ఉదయం సూర్యనారాయణ.. పద్మ, నూతన్ కుమార్ లు సహజీవనం చేస్తున్న ఇంటికి వెళ్లాడని, ఒంటిపై బట్టలు లేని స్థితిలో, రెండు చేతులూ తెగిపోయి పడివున్న ఆమెను చూసి, హత్యకు గురైందని భావిస్తూ, పోలీసులకు సమాచారం ఇచ్చాడని తెలిపారు.

ఘటనా స్థలికి వచ్చిన తరువాత ఆమె కొన ఊపిరితో ఉండటాన్ని గుర్తించిన పోలీసులు, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పద్మపై ఆమె ప్రియుడు నూతన్ కుమారే హత్యాయత్నం చేశాడని భావిస్తున్న పోలీసులు, ప్రస్తుతం పరారీలో ఉన్న అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పద్మపై దారుణంగా ప్రవర్తించిన నూతన్ ను తక్షణం అరెస్ట్ చేసి, ఎన్ కౌంటర్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భర్తకు దూరమైన పద్మ, గత కొంతకాలంగా నూతన్ కుమార్ తో సహజీవనం చేస్తోంది. 

More Telugu News