antaku minchi: రష్మీ చెప్పేవరకూ నాకు తెలియదు.. ‘అంతకుమించి’ వివాదంపై స్పందించిన హీరో!

  • బ్లాక్ మెయిల్ కోసమే కేసు దాఖలు
  • అన్నిహక్కులు గతంలోనే రాసిచ్చాడు
  • వివాదంపై నోరు విప్పిన సతీష్

‘అంతకుమించి’ సినిమాను నిర్మాతలు కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా విడుదల చేశారంటూ గౌరీశంకర్ ప్రసాద్ అనే నిర్మాత ఈ రోజు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా హీరో సతీష్ జాయ్ స్పందించాడు. ఈ సినిమా నిర్మాణానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. కన్నా, భాను, సతీష్ అనే ముగ్గురు వ్యక్తులు సినిమాపై అన్ని హక్కులను ప్రసాద్ కు రాసిచ్చేశారని తెలిపాడు. ఈ వివాదంపై సతీష్ ఏబీఎన్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడాడు.

సినిమా హక్కులు రాసిచ్చిన ఏడాది తర్వాత తాము షూటింగ్ పూర్తిచేసి ఈ నెల 24న విడుదల చేశామని చెప్పాడు. సినిమాకు హైప్ వస్తున్నందున బ్లాక్ మెయిల్ చేసేందుకే అతను పోలీసులను ఆశ్రయించాడని హీరో సతీష్ ఆరోపించాడు. తనకు అసలు కోర్టు నుంచి స్టే ఆర్డరే రాలేదన్నాడు. హీరోయిన్ రష్మీ ఫోన్ చేసి స్టే విషయం చెప్పేవరకూ తనకు అసలు ఏమీ తెలియదని వ్యాఖ్యానించాడు. మామూలుగా ఎవరైనా రూ.50 లక్షలు రావాల్సి ఉంటే రోజుకు 2-3 సార్లు ఫోన్ చేస్తారనీ, కానీ ప్రసాద్ మాత్రం గత ఏడాది కాలంలో ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదని, దానిని బట్టి అర్థం చేసుకోవచ్చని సతీష్ తెలిపాడు.

తాను ఈ సినిమాకు రూ.50 లక్షలు పెట్టాననీ, కానీ ఆర్థిక కష్టాలతో సినిమా ఆగిపోయిందని నిర్మాత ప్రసాద్ ఈ రోజు ఉదయం మీడియాకు తెలిపాడు. హీరో సతీష్ తాను ఈ సినిమాను నిర్మిస్తానని ముందుకొచ్చాడన్నారు. తాను పెట్టుబడిగా పెట్టిన మొత్తాన్ని తిరిగి ఇస్తానని కూడా చెప్పాడనీ, కానీ ఇప్పటివరకూ ఇవ్వకుండా మోసం చేశాడని ఆరోపించాడు. సెప్టెంబర్ 4 వరకూ సినిమాను విడుదల చేయకూడదని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ శుక్రవారం సినిమాను విడుదల చేశారంటూ బంజారాహిల్స్  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

More Telugu News