Nellore District: మేకపాటితో ఆనం రాంనారాయణ రెడ్డి భేటీ.. సెప్టెంబర్ 2న వైసీపీ తీర్థం?

  • నెల్లూరులో మారుతున్న రాజకీయాలు
  • వెంకటగిరిపై ఆనం కన్ను
  • కాకాణి గోవర్ధన్ రెడ్డితోనూ సమావేశం

మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు మార్గం సుగమమైంది. ఇన్నాళ్లు టీడీపీలో ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ చార్జ్ గా ఉన్న రాంనారాయణ రెడ్డి, టీడీపీ నుంచి బయటికొస్తారని, వైసీపీలో చేరతారని ఇటీవల ప్రచారం జరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే ఆనం ఈ రోజు వైసీపీ సీనియర్ నేత, పార్లమెంటు మాజీ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డితో సమావేశమయ్యారు.

జిల్లాలో రాజకీయ పరిస్థితులు, వైసీపీలో చేరిక తదితర అంశాలపై మేకపాటితో ఆనం ముచ్చటించినట్టు సమాచారం. మేకపాటితో భేటీకి ముందు ఆనం నెల్లూరు జిల్లా వైసీపీ చీఫ్ కాకాణి గోవర్ధన్ రెడ్డితోనూ గురువారం సమావేశమయ్యారు.

కాగా, సెప్టెంబర్ 2న మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా జగన్ సమక్షంలో ఆనం వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రజా సంకల్పయాత్ర పూర్తయ్యాక నెల్లూరులో భారీ బహిరంగ సభను ఆనం వర్గీయులు ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆనం వెంకటగిరి సీటును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

More Telugu News