Maruti: రోడ్డుపై ఇబ్బందుల్ని అధిగమించడానికి ఇక మారుతి ‘క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌’!

  • ప్రయాణంలో కారు నిలిచిపోతే తక్షణ స్పందన కోసం
  • 251 నగరాల్లో అందుబాటులోకి సేవలు
  • ఫోన్‌ చేసిన కొద్దిసేపటికే హాజరయ్యేలా ఏర్పాటు

సేవల విషయంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆయా కంపెనీలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. ఈ క్రమంలో దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) మరో అడుగు ముందుకు వేసింది. ప్రయాణం మధ్యలో కారు నిలిచిపోయినప్పుడు వాహనదారులు పడే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని, తక్షణ మరమ్మతుల కోసం ‘క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌  (క్యూఆర్‌టీ)ను అందుబాటులోకి తెచ్చింది.

తొలిదశలో 251 నగరాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నామని, 2020 నాటికి 500 నగరాలకు విస్తరిస్తామని మారుతీ సుజుకీ ఎండీ, సీఈఓ కెనిచీ అయుకవా తెలిపారు. ‘కారు నిలిచిపోయినట్లు సమాచారం అందగానే బైక్‌పై మా క్యూఆర్‌టీ సిబ్బంది స్పాట్‌కు చేరుకుంటారు. వారివద్ద టూల్‌ కిట్‌తోపాటు ముఖ్యమైన స్పేర్‌ పార్ట్స్‌ కూడా ఉంటాయి. అక్కడికక్కడే రిపేర్‌ చేసి పంపిస్తారు’ అని కంపెనీ ఈడీ (సర్వీస్‌) పార్థోబెనర్జీ వివరించారు.

 ప్రయాణంలో కారు ట్రబుల్‌ ఇచ్చినట్లు ప్రతి నెలా మాకు 10 వేల వరకు ఫోన్లు వస్తుంటాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ వినియోగదారులకు వారంటీపై కాంప్లిమెంట్‌గా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. వారంటీ లేకున్నా దూరాన్ని బట్టి విజిటింగ్‌ చార్జీలుగా రూ.420 నుంచి రూ.525 చెల్లించి ఈ సదుపాయం వినియోగించుకోవచ్చని  బెనర్జీ తెలిపారు.

More Telugu News