Krishna District: కృష్ణా జిల్లాలో దారుణం.. ప్రియురాలిని కాళ్లు, చేతులు కట్టేసి నరికిన ప్రియుడు!

  • భర్తతో విడిపోయిన బ్యూటీషియన్ పద్మ
  • మరో యువకుడితో సహజీవనం
  • విభేదాలు రావడంతో కిరాతకంగా దాడి

నమ్మినవాడే ఆమెను నట్టేట ముంచాడు. భర్తతో విడిపోయి ఉంటున్న ఓ మహిళకు దగ్గరైన యువకుడు చివరికి ఆమెపైనే హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని బాపులపాడులో చోటుచేసుకుంది.

బాపులపాడుకు చెందిన పద్మ అనే మహిళ స్థానికంగా బ్యూటీషియన్ గా పనిచేస్తోంది. భర్తతో విభేదాలు రావడంతో గత కొద్దికాలంగా పద్మ అతనికి దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో నూతన్ ప్రసాద్ అనే యువకుడితో ఆమెకు సంబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. అయితే ఈ వివాహేతర సంబంధంపై పద్మ, ప్రసాద్ ల మధ్య విభేదాలు వచ్చాయి.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రసాద్ ఈ రోజు ఉదయం పద్మ కాళ్లు, చేతులను ఎలక్ట్రానిక్ మోటార్లకు వాడే ప్రత్యేకమైన వైర్ తో కట్టేశాడు. అనంతరం కత్తితో ఆమెపై విచక్షణా రహితంగా దాడిచేశాడు. ఆ తర్వాత బయటనుంచి తలుపు వేసి వెళ్లిపోయాడు. పద్మ అరుపులను విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని విజయవాడలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సదరు మహిళ పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఈ దాడికి పాల్పడిన ప్రసాద్ విజయవాడలోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తేలింది. వివాహేతర సంబంధం విషయంలో అభిప్రాయభేదం తలెత్తడంతోనే ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపితేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు.

More Telugu News