Madhya Pradesh: నాకే ఫైన్ వేస్తావా?.. అంటూ రచ్చ చేసిన మధ్యప్రదేశ్ సీఎం 'బావమరిది'!

  • మధ్యప్రదేశ్ విధానసభ ముందు ఓ వ్యక్తి రచ్చ
  • ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఫైన్ విధించిన పోలీసులు
  • రాష్ట్రంలో నాకు కోట్లాది మంది బావ, బావమరదులు ఉన్నారంటూ చమత్కరించిన శివరాజ్ సింగ్ చౌహాన్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ బావమరిదిని అంటూ ఓ వ్యక్తి రచ్చరచ్చ చేశాడు. రాష్ట్ర విధానసభ ముందు పోలీసులకు హెచ్చరికలు జారీ చేశాడు. వివరాల్లోకి వెళ్తే, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ వ్యక్తిని పోలీసులు ఆపారు. చేసిన తప్పుకు ఫైన్ కట్టాలని చెప్పారు. దీంతో, సదరు వ్యక్తి రెచ్చిపోయాడు.

ముఖ్యమంత్రి బావమరిదిని... నాకే ఫైన్ వేస్తారా? అంటూ పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. రోడ్డు మీదే ఆందోళనకు దిగాడు. అంతేకాదు, పోలీసులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. దీంతో, పోలీసులు షాక్ అయ్యారు. నిజంగానే సీఎం బావమరిదేమో అని... తడబాటుకు గురయ్యారు. మధ్యలో మరికొంత మంది పోలీసులు వచ్చి, గొడవను తగ్గించారు.

ఈ విషయం చివరకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరకు వెళ్లింది. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో తనకు కోట్లాది మంది అక్కాచెల్లెళ్లు ఉన్నారని... వారి భర్తలంతా తనకు బావ, బావమరదులే అవుతారని చమత్కరించారు. 

More Telugu News