Andhra Pradesh: ఇష్టం లేని వివాహంతో మనస్తాపం.. బావిలోకి దూకి నవ వధువు ఆత్మహత్య

  • వద్దంటున్నా ఇష్టం లేని పెళ్లి చేసిన తల్లిదండ్రులు
  • అత్తారింటికి వెళ్లనని మారాం
  • అర్ధరాత్రి బావిలో దూకి తనువు చాలించిన కొత్త పెళ్లికూతురు

ఇష్టం లేని పెళ్లి చేశారన్న మనస్తాపంతో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖపట్టణం జిల్లా రోలుగుంట మండలంలోని కొండపాలెంలో జరిగింది. రోలుగుంట పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొండపాలేనికి చెందిన పిల్లా భూలక్ష్మికి, మాకవరపాలెం మండలం గిడుతూరుకు చెందిన అధికారి శ్రీనివాస్‌తో రెండు నెలల క్రితం వివాహమైంది. ఆషాఢమాసానికి పుట్టింటికి వచ్చిన భూలక్ష్మిని గురువారం మెట్టినింటికి పంపేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, వద్దంటున్నా వినకుండా తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని, అత్తవారింటికి వెళ్లనని భూలక్ష్మి రోదిస్తూ చెప్పింది.

ఆమె మాటలను తేలిగ్గా తీసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భూలక్ష్మి బుధవారం అర్ధరాత్రి చడీచప్పుడు కాకుండా గ్రామ శివారులోని బావి వద్దకు చేరుకుని, అందులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News