Tamilnadu: కోరిక తీర్చావంటే మంచి మార్కులేస్తా.. రెండో భార్యగా ఉండిపో!: విద్యార్థినికి ప్రొఫెసర్ వేధింపులు

  • తమిళనాడులోని తిరువణ్ణామలైలో దారుణం
  • కోరిక తీర్చాలంటూ విద్యార్థినికి వేధింపులు
  • మహిళా వార్డెన్ల సాయంతో ఒత్తిడి

తన దగ్గర చదివే అమ్మాయిలను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఓ గురువు కీచకుడిగా మారాడు. తన కోరికను తీర్చాలని, రెండో భార్యగా ఉంచుకుంటానని వేధించాడు. మాట వినకపోవడంతో ఆమె ఉంటున్న హాస్టల్ వార్డెన్లతో రాయబారం నడిపాడు. చివరికి ఈ వేధింపులు తట్టుకోలేని యువతి కోర్టును ఆశ్రయించింది.

తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని వాళవచ్చనూర్ ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో ఓ యువతి(22) బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. ఇదే కాలేజీలో మధురైకి చెందిన తంగపాండియన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాధిత యువతిపై కన్నేసిన పాండియన్ ఆమెను లొంగదీసుకునేందుకు యత్నించాడు. రాత్రివేళ్లలో ఆమె ఉంటున్న హాస్టల్ వద్దకు వెళ్లి వేధించడం ప్రారంభించాడు.

ఈ వేధింపులు తట్టుకోలేని బాధితురాలు తన బాధను హాస్టల్ వార్డెన్ల వద్ద చెప్పుకుంది. దీంతో వార్డెన్లతో మాట్లాడిన సదరు ప్రొఫెసర్ వారి ద్వారా యువతిని లొంగదీసుకునేందుకు ప్లాన్ వేశాడు. ప్రొఫెసర్ తంగపాండియన్ చెప్పినట్లు నడుచుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుందనీ, మంచి మార్కులతో పాసై ఇక్కడే ఫ్యాకల్టీగా చేరవచ్చని ఇద్దరు మహిళా వార్డెన్ల చేత ఒత్తిడి చేయించాడు. తనకు రెండో భార్యగా ఉండిపోవచ్చని వార్డెన్ల చేత చెప్పించాడు. అయితే ఈ ఫోన్ కాల్స్ ను బాధిత యువతి తెలివిగా రికార్డు చేసింది.

చివరికి ఈ వేధింపులు హద్దు దాటడంతో బాధితురాలు తల్లిదండ్రులతో తన గోడును వెళ్లబోసుకుంది. దీంతో యువతి బంధువులు, సీపీఐ నేతలు మంగళవారం కాలేజీని ముట్టడించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం బాధితురాలు కోర్టులో ఫిర్యాదు చేసి, ప్రొఫెసర్, వార్డెన్ల వేధింపులకు సంబంధించిన కాల్ రికార్డింగులను జడ్జీకి అందించింది.

ఈ నేపథ్యంలో యువతిని మరో కాలేజీలో చేర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు పాండియన్ పరారీలో ఉండగా.. ఇద్దరు హాస్టల్ వార్డెన్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

More Telugu News