laxmivara theertha swamiji: అనారోగ్యంతోనే శిరూరు మఠాధిపతి కన్నుమూత.. స్పష్టం చేసిన ఫోరెన్సిక్ నివేదిక

  • అనుమానాలు పటాపంచలు
  • కాలేయం చెడిపోవడంతో మృతి
  • నివేదికను పరిశీలించిన తర్వాత వివరాల వెల్లడి

క్షణానికో మలుపు తిరిగిన శిరూరు మఠాధిపతి లక్ష్మీవరతీర్థ మృతి కేసులో ఎట్టకేలకు ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది. ఈ నివేదిక ఇంకా బహిర్గతం కానప్పటికీ అనారోగ్యంతోనే ఆయన కన్నుమూసినట్టు నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. లక్ష్మీవరతీర్థ మరణపైం కన్నడిగులు ఇప్పటి వరకు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడీ నివేదికతో వారి సందేహాలకు ఫుల్‌స్టాప్ పడుతుందని భావిస్తున్నారు.

లక్ష్మీవరతీర్థ జూలై 19న ఉడుపి సమీపంలోని మణిపాల్ వైద్యాలయంలో మృతి చెందారు. అయితే, ఆహారంలో విషం కలపడం వల్లే ఆయన మృతి చెందినట్టు పలువురు అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా ఆయన మృతిపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆయనది హత్యేనని, పథకం ప్రకారం ఆయనను మట్టుబెట్టారన్న ఆరోపణలూ ఉన్నాయి. అయితే, ఫోరెన్సిక్ పరీక్షల్లో ఆరోపణల్లో వాస్తవం లేదని తేలింది. ఆయన అనారోగ్యంతోనే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. కాలేయం దెబ్బతినడమే ఆయన మృతికి కారణమని తేలింది. అయితే, నివేదికలోని అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే దానిని బహిర్గతం చేయనున్నారు.

More Telugu News