New Delhi: డిప్లొమా విద్యార్థి ప్రయోగానికి అమెరికా కంపెనీ ఫిదా.. రూ.70 లక్షల వేతనంతో జాబ్ ఆఫర్!

  • డిప్లొమా చేస్తున్న  అలీ
  • అతడి ప్రయోగానికి పడిపోయిన అమెరికా కంపెనీ
  • వెంటనే వచ్చి చేరమంటూ ఆఫర్

చేస్తున్న పనిపై ఇష్టం.. పట్టుదల.. మనిషి ఉన్నతంగా ఎదగడానికి ఈ రెండు చాలని చాలామంది అభిప్రాయం. అది నిజమని నిరూపించాడు ఢిల్లీకి చెందిన ఓ ఎలక్ట్రీషియన్ కొడుకు. ఏడాదికి రూ.70 లక్షల వేతనం ఇస్తాం.. వెంటనే వచ్చి చేరమంటూ అమెరికా నుంచి అతడికి పిలుపొచ్చింది. అమెరికా కంపెనీనే ఆకర్షించిన ఆ కుర్రాడు ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశాడు. తండ్రి అదే కళాశాలలో ఎలక్ట్రీషియన్.

డిప్లొమా పూర్తి చేసిన అలీ గత కొంతకాలంగా విద్యుత్ సాయంతో నడిచే వాహనాలకు చార్జింగ్ విధానంపై పరిశోధన చేస్తున్నాడు. చివరికి అతడి ప్రయత్నం ఫలించి చార్జింగ్‌కు రూపాయి కూడా ఖర్చుకాని విధానాన్ని రూపొందించాడు. దీనిని ప్రయోగాత్మకంగా చేసి చూపించాడు. ఇందుకు సంబంధించిన నమూనాను, అతడి ప్రయోగ వివరాలను కాలేజీ యాజమాన్యం తమ వెబ్‌సైట్‌లో పెట్టింది.

జామియా మిల్లియా ఇస్లామియా కళాశాల వెబ్‌సైట్‌లో అలీ పరిశోధనను చూసి అమెరికాకు చెందిన ఫ్రిస్సన్ మోటార్ వర్క్స్ అనే సంస్థ అచ్చెరువొందింది. అలీ ప్రయోగాన్ని మెచ్చుకుని అతడి గురించి ఆరా తీసింది. ఏడాదికి రూ.70 లక్షల వేతనాన్ని ఆఫర్ చేస్తూ తమ సంస్థలో బ్యాటరీ మేనేజ్‌మెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాలని ఆహ్వానించింది. అమెరికా నుంచి పిలుపు రావడంతో అలీ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
  

More Telugu News