KTR: వచ్చే వేసవికి హైదరాబాద్ లో 500 బస్తీ దవాఖానాల ఏర్పాటు!

  • మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి వెల్లడి
  • బస్తీ దవాఖానాల విస్తరణపై చర్చ
  • సమీక్షలో వైద్య ఆరోగ్య, పురపాలక శాఖాధికారులు

తెలంగాణలో బస్తీ దవాఖానాల విస్తరణపై మంత్రులు కేటీ రామారావు, లక్ష్మారెడ్డి ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ, పురపాలక శాఖాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే ప్రారంభించిన బస్తీ దవాఖానాలకు ప్రజల నుంచి వస్తున్న మంచి స్పందన నేపథ్యంలో వీటిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ముందుగా రాష్ట్రంలోని అన్ని కార్పోరేషన్లతోపాటు పాత జిల్లా కేంద్రాల్లో బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

ఇప్పటికే నిజామాబాద్ లో 5, కరీంనగర్ పట్టణంలో 5, వరంగల్ పట్టణంలో 12 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు అధికారులు తెలియజేశారు. ‘అందరికీ  అందుబాటులో ఆరోగ్యం’ అనే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు మంత్రులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయడం, కొత్త వాటిని ఏర్పాటు చేయడంతోపాటు పట్టణాల్లో బస్తీ దవాఖాన వంటి వినూత్నమైన ఏర్పాట్లతో ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, గత నెలలో స్వయంగా బేగంపేటలోని బస్తీ దవాఖానాను ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా అక్కడి సేవలు ఉపయోగించకునేందుకు వచ్చిన ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, ముఖ్యంగా ప్రాథమిక వైద్య అవసరాలకోసం ఇంతకు ముందు ప్రయివేటు క్లినిక్కుల్లో డబ్బులు ఖర్చు చేసేవాళ్లమని, ఇప్పుడు తమకు ఆ పరిస్ధితి తప్పిందని సంతోషం వ్యక్తం చేశారన్నారు. ప్రజల నుంచి మరిన్ని బస్తీ దవాఖానాలకు డిమాండ్ ఉన్నదని, ఈ నేపథ్యంలో వాటి విస్తరణకు ఈ సంయుక్త సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు.

దీంతోపాటు ముఖ్యమంత్రి అదేశాల మేరకు వచ్చే వేసవి నాటికి హైదరాబాద్ నగరంలో 500 బస్తీ దవాఖానాలు ప్రారంభించేందుకు ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ డిసెంబర్ మాసాంతానికి సూమారు 175 బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న నగర జనాభా వైద్య అవసరాలను అందుకునేలా, ముఖ్యంగా పేదల సంఖ్య అధికంగా ఉండే ప్రాంతాల్లో ఇవి ఉండేలా చూడాలన్నారు. ఈ బస్తీ దవాఖానాలన్నింటినీ ఆన్ లైన్లో మ్యాపింగ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఈ మేరకు అవసరం అయితే ఐటి శాఖ సహకారం తీసుకోవాలన్నారు. ఈ 500 బస్తీ దవాఖానాలకు అవసరం అయిన భవనాలను గుర్తించాలని, ఒకవేళ భవనాలు అందుబాటులో లేకుంటే నూతనంగా నిర్మించేందుకు చర్యలు ప్రారంభించాలని పురపాలక శాఖాధికారులకు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికే ప్రారంభానికి సిద్ధం చేస్తున్న మరో 28 బస్తీ దవాఖానాలను సెప్టెంబర్ మొదటి వారంలో ఒకేరోజు ప్రారంభించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. బస్తీ దవాఖానాలతో పాటు తెలంగాణ డయాగ్నస్టిక్స్ సేవలను సైతం మంత్రులు సమీక్షించారు. ఇప్పటికే ఈ సెంటర్లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని వైద్య అరోగ్య శాఖాధికారులు మంత్రులకు తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఈ సెంటర్ల ఏర్పాటు లక్ష్యంతో వైద్య అరోగ్య శాఖ ప్రణాళికలు తయారు చేస్తున్నదని అధికారులు తెలిపారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ సేవలను మరింత ప్రజల్లోకి  తీసుకువెళ్లేందుకు ప్రభుత్వాసుపత్రులు, పీహెచ్ సీ సెంటర్ల వద్ద సమాచారం అందుబాటులో ఉంచాలని మంత్రులు అధికారులకు సూచించారు.

More Telugu News