Chandrababu: అప్పుల అప్పారావులా అమరావతి బాండ్లను అమ్ముతున్నారు!: చంద్రబాబుపై వైసీపీ నేత పార్థసారథి ధ్వజం

  • టీడీపీ సర్కార్ క్యాన్సర్ లా రాష్ట్రాన్ని పట్టుకుంది 
  • అప్పుల అప్పారావులా చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారు
  •  అమరావతి బాండ్ల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు

వైఎస్సార్ సీపీ నేత కొలుసు పార్థసారథి టీడీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని ముంచేస్తున్నారని, టీడీపీ సర్కార్ రాష్ట్రానికి క్యాన్సర్ జబ్బులా పట్టుకుందని మండిపడ్డారు. అమరావతి బాండ్ల రూపంలో బాబు దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. ఇన్వెస్టర్ల రూపంలో నిధులు సమీకరించి చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్ధిక వనరుగా మార్చుకున్నారని ఆరోపించారు. దోచుకున్నోళ్ళకు దోచుకున్నంత అన్న చందంగా రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని మండిపడ్డారు.

 అప్పుల అప్పారావులా అమరావతి బాండ్లను అమ్ముతూ రాష్ట్రంపై ఆర్థికభారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  సీఆర్డీఏ ఆర్థికంగా బలంగా వున్నప్పుడు అమరావతి బాండ్లు ఎందుకు? అని ప్రశ్నించిన పార్థసారథి, విభజన హామీలను తాకట్టు పెట్టిన వ్యక్తిగా సీఎం చంద్రబాబును అభివర్ణించారు. వర్షం పడితే మంత్రుల ఛాంబర్లలోకి నీళ్ళు ఎలా వస్తున్నాయి? మంత్రులే పైపులు కోశారా? అని ఎద్దేవా చేశారు. గతంలో జగన్ ఛాంబర్లోకి నీళ్ళు వచ్చినప్పుడు టీడీపీ నాయకులు కూడా ఇలానే మాట్లాడారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి రాష్ట్ర ప్రయోజనాలను నాశనం చేస్తోందని పార్థసారథి అసహనం వ్యక్తం చేశారు.

More Telugu News