nallari: ‘నల్లారి’ వారింట సరికొత్త పోరు.. అన్నను కూడా కేర్ చేయనంటున్న కిశోర్!

  • టీడీపీ టికెట్ పై పీలేరులో కిశోర్ పోటీ
  • కిరణ్ పోటీ చేసినా వెనక్కి తగ్గబోనని ప్రకటన
  • దుమ్మెత్తిపోస్తున్న మాజీ సీఎం వర్గీయులు

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈ నియోజకవర్గం నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై పోటీకి తమ్ముడు కిశోర్ సై అంటున్నారు. ఇటీవల టీడీపీలో చేరిన కిశోర్ పీలేరు టికెట్ తనకే దక్కుతుందన్న విశ్వాసంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్నపై పోటీ చేయాల్సి వచ్చినా వెనక్కి తగ్గబోనని ఆయన స్పష్టం చేశారు.
 
పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ పై తాను 2019లో పోటీ చేయబోతున్నట్లు కిశోర్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఒకవేళ మీ సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీచేస్తే మీరు తప్పుకుంటారా? అన్న ప్రశ్నకు కిశోర్ తీవ్రంగా స్పందించారు. ఎవరు పోటీలో ఉన్నా తాను మాత్రం వెనక్కు తగ్గబోనని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో కిశోర్ వ్యాఖ్యలపై కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులు మండిపడుతున్నారు.

కిరణ్ సీఎంగా ఉండగా కిశోర్ చిత్తూరులో చక్రం తిప్పిన విషయాన్ని ఆయన అనుచరులు గుర్తుచేస్తున్నారు. అన్నిరకాలుగా అండగా నిలబడిన అన్నకు కిశోర్ ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ కిరణ్ వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News