bihar: మహిళ నగ్నంగా ఊరేగింపు.. గాల్లోకి కాల్పులు జరిపి చెదరగొట్టిన ఎస్పీ

  • బీహార్ లో చోటు చేసుకున్న ఆటవిక ఘటన
  • రెడ్ లైట్ ఏరియాలోని మహిళపై దాడి
  • ఇంట్లోంచి లాక్కొచ్చి, నగ్నంగా ఊరేగింపు

బిహార్ భోజ్ పూర్ జిల్లాలోని బహియా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని చంపిందనే నెపంతో కొందరు వ్యక్తులు ఓ మహిళపై ఆటవికంగా దాడి చేశారు. అంతేకాదు, ఆమెను నగ్నంగా ఊరేగించారు. వివరాల్లోకి వెళ్తే... దామోదర్ పూర్ కు చెందిన విమలేష్ షా అనే వ్యక్తి సోమవారం నుంచి కనిపించకుండా పోయాడు. నిన్న ఉదయం అతని మృత దేహం సమీపంలోని రైల్వే స్టేషన్ స్టేషన్ వద్ద కనిపించింది. దీంతో, గ్రామస్తులు అక్కడకు వెళ్లారు.

విమలేష్ మృతి చెందిన ప్రాంతానికి దగ్గర్లోనే రెడ్ లైట్ ఏరియా ఉంది. దీంతో, ఇతని మృతికి రెడ్ లైట్ ఏరియాలో ఉండే ఓ మహిళ కుటుంబమే కారణం కావచ్చని గ్రామస్తులు భావించారు. దీంతో సదరు మహిళను ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి, ఆమెపై రాక్షసంగా దాడి చేశారు. వస్త్రాలను తొలగించి, నగ్నంగా ఊరేగించారు. అంతేకాదు, ఆమె ఇంటికి, అక్కడున్న ఒక మోటార్ బైక్ కు నిప్పంటించారు. దీంతో, అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.

సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ అక్కడకు చేరుకుని, గాల్లోకి కాల్పులు జరిపి, మూకను చెదరగొట్టారు. భారీ ఎత్తున బలగాలను దింపి, అల్లర్లను అదుపులోకి తెచ్చారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. అలసత్వం వహించిన 8 మంది పోలీసులను సస్పెండ్ చేశామని తెలిపారు.

More Telugu News