Kakinada: కాకినాడలో దారుణం... తన కొడుకుతో సంబంధం పెట్టుకుందని, ఓ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి!

  • భర్తతో విడిపోయిన వివాహితురాలు మల్లీశ్వరి
  • ఆటో నడుపుకునే యువకుడితో సహజీవనం
  • ఆగ్రహంతో నిప్పంటించిన యువకుడి తండ్రి

అవివాహితుడైన తన కుమారుడితో వివాహమైన ఓ యువతి సంబంధం పెట్టుకుని చెడగొడుతోందని ఆరోపిస్తూ, ఓ తండ్రి ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన కాకినాడలో కలకలం రేపుతోంది. ఈ ఘటనలో బాధితురాలు మల్లీశ్వరికి తీవ్ర గాయాలు కాగా, ఆమెను కాకినాడ జీజీహెచ్ కి తరలించి చికిత్సను అందిస్తున్నారు.

వన్ టౌన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, రావుల మల్లీశ్వరి (21)కి ఏడేళ్ల క్రితం అప్పారావు అనే వ్యక్తితో వివాహం కాగా, వారికి మూడేళ్ల కుమార్తె ఉంది. భర్తతో విడిపోయిన ఆమె, స్థానిక గురజనాపల్లిలోని పుట్టింట్లో ఏడాదిగా ఉంటోంది. ఫంక్షన్లు జరిగినప్పుడు సామాన్లు శుభ్రపరిచే పనులకు వెళుతోంది.

ఈ క్రమంలో వంట సామాను తరలించే ఆటో నడుపుకునే గంగాద్రి అలియాస్ బాబీతో ఆమెకు పరిచయం ఏర్పడగా, వారిద్దరూ గత ఆరు నెలలుగా ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. గత వారం రోజులుగా గంగాద్రి తన వద్దకు రాకపోవడంతో, అతని తల్లిదండ్రులే అడ్డుకుని ఉంటారని భావిస్తూ, వారింటికి వెళ్లి గొడవపడింది మల్లీశ్వరి.

పెళ్లి కావాల్సిన కుమారుడితో నీకు పనేంటని గంగాద్రి తల్లిదండ్రులు కామేశ్వరరావు, అమ్మాజీలు ఆమెను నిలదీశారు. అక్కడ వాగ్వాదం పెరిగి ఘర్షణ జరుగగా, ఆగ్రహంతో సమీపంలో ఉన్న పెట్రోలు బాటిల్ ను తీసి మల్లీశ్వరిపై చల్లి నిప్పంటించాడు తండ్రి. దీంతో ఆమె హాహాకారాలు చేస్తూ, రోడ్డుపై పరుగులు పెట్టగా, స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమెకు 85 శాతం గాయాలు అయ్యాయని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించగా, కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

More Telugu News