Telangana: ప్రేమించి పెళ్లాడిన ఆరు నెలలకే ఘాతుకం.. భార్య గొంతు కోసి దారుణ హత్య!

  • నల్గొండ జిల్లాలో ఘటన
  • అబార్షన్ చేయించుకోవాలంటూ చిత్ర హింసలు
  • అత్తింటికి వెళ్లి మరీ భార్య గొంతు కోసిన భర్త

ప్రేమించి పెళ్లాడిన యువకుడు ఆరు నెలలు కూడా తిరగకుండానే భార్యను అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన  నల్గొండ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని తిప్పర్తి మండలం మల్లేపల్లివారి గూడేనికి చెందిన జంజిరాల శ్రీనివాస్ (30).. అదే గ్రామానికి చెందిన మల్లేపల్లి ఆసియాను ప్రేమించాడు. రెండేళ్లపాటు వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే, ఆ తర్వాత ఆసియాను పెళ్లాడేందుకు శ్రీనివాస్ నిరాకరించాడు. పెద్దలు జోక్యం చేసుకున్నా ఫలితం లేకపోవడంతో ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. అలాగే, ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దిగొచ్చిన శ్రీనివాస్ మార్చి 11న ఆసియా మెడలో మూడుముళ్లు వేశాడు. అనంతరం తిప్పర్తిలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

ఆసియా ఇటీవల గర్భం దాల్చింది. విషయం తెలిసినప్పటి నుంచి శ్రీనివాస్ ఆమెకు నరకం చూపించడం మొదలుపెట్టాడు. అబార్షన్ చేయించుకోవాలంటూ రోజూ ఒత్తిడి తెచ్చేవాడు. తీవ్రంగా హింసించేవాడు. దీంతో తట్టుకోలేని ఆమె రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య ఇంటికి రాకపోవడంతో పది రోజుల క్రితం అత్తింటికి వెళ్లిన శ్రీనివాస్ భార్యను తనతో పంపాలని గొడవకు దిగి అత్త వెంకటమ్మ, భార్య ఆసియాపై చేయి చేసుకున్నాడు. తాజాగా సోమవారం మరోమారు వారింటికి వెళ్లిన శ్రీనివాస్ భార్యతో గొడవ పడి బ్లేడుతో భార్య గొంతు కోసి పరారయ్యాడు. రక్తపుమడుగులో కుప్పకూలిన ఆసియా అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News