Bajrang Dal: సిద్ధూ తల నరికి తెస్తే రూ.5 లక్షల నజరానా.. ప్రకటించిన భజరంగ్ దళ్ ఆగ్రా అధ్యక్షుడు సంజయ్

  • పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకోవడంపై విమర్శలు
  • సొంత పార్టీ ముఖ్యమంత్రి నుంచి కూడా మద్దతు కరవు
  • బీహార్‌లో రాజద్రోహం కేసు నమోదు

ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాకిస్థాన్ వెళ్లిన టీమిండియా మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ కోరి కష్టాల పాలయ్యారు. వీరు, వారని లేకుండా అందరూ ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. చివరికి సొంత పార్టీ ముఖ్యమంత్రి కూడా ఆయన చర్యను తప్పుబట్టారు. తాజాగా నవజోత్ సింగ్ సిద్ధూ తలనరికి తెచ్చిచ్చిన వారికి రూ.5 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు భజరంగ్ దళ్ ఆగ్రా జిల్లా అధ్యక్షుడు సంజయ్ జూట్ ప్రకటించి కలకలం రేపారు. ఎవరైనా ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చన్నారు.

ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన సిద్ధూ పాక్ ఆర్మీ చీఫ్ కమర్ జావెద్ బజ్వాను ఆలింగనం చేసుకున్నారు. సరిహద్దుల్లో మన సైనికుల చావులకు పాక్ కారణమవుతుంటే, మరోవైపు ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను అంత ఆప్యాయంగా కౌగిలించుకోవడంపై పార్టీలన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. శివసేన అయితే, ఇదో సిగ్గుమాలిన చర్య అని మండిపడింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్ కోర్టులో సిద్ధూపై రాజద్రోహం కేసు నమోదైంది.

More Telugu News