Chandrababu: 600 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు: కేంద్రంపై చంద్రబాబు విమర్శలు

  • కేరళ ప్రళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి
  • కేంద్ర ప్రభుత్వం ఎంతో ఉదారతతో వ్యవహరించాలి
  • రాష్ట్రాలే సాయం చేస్తున్నప్పుడు.. కేంద్రం ఇంకా ఎక్కువ చేయాలి

జల దిగ్బంధంతో అతలాకుతలమైన కేరళను ఆదుకోవడానికి అందరూ ముందుకు వస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తమ వంతు సాయం అందించడానికి యూఏఈ లాంటి దేశాలు కూడా ముందుకు వస్తున్నాయని చెప్పారు. కేరళ ప్రళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 600 కోట్లు మాత్రమే ఇచ్చి, చేతులు దులుపుకుందామనుకోవడం సరికాదని అన్నారు. మొక్కుబడిగా ఏదో చేద్దామనుకోవడం కరెక్ట్ కాదని తెలిపారు. ఎంతో ఉదారతతో కేరళకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేరళకు రాష్ట్రాలే సాయం చేస్తున్నప్పుడు.. కేంద్రం ఇంకా ఎక్కువ చేయాలని అన్నారు.

కేరళకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్ల విరాళం ప్రకటించిందని, ఏపీ ఎన్జీవోలు రూ. 20 కోట్ల సాయాన్ని ప్రకటించారని చంద్రబాబు చెప్పారు. హుద్ హుద్ తుపాను సమయంలో రాష్ట్రానికి కేంద్రం రూ. 1000 కోట్లను ప్రకటించిందని... కానీ, రూ. 650 కోట్లను మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. ఏపీలో విచిత్రమైన పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. రాయలసీమలో వర్షపాతం నమోదు కాలేదని... కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. 

More Telugu News