Kerala: కేరళలో హృదయవిదారకం... ఇంట్లోని అందరినీ కాపాడి విగతజీవిగా మారిన ధైర్యశాలి!

  • త్రిసూర్ జిల్లాలో ఘటన
  • గ్రామాన్ని చుట్టుముట్టిన నీరు
  • తల్లిదండ్రులను, తోబుట్టువులనూ కాపాడి మరణించిన యువకుడు

వరదనీరు చుట్టుముట్టిన వేళ, ఇంట్లోని వారందరినీ తన ధైర్యసాహసాలతో కాపాడిన ఓ యువకుడు, అదే వరదలో ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన కేరళలోని త్రిసూర్ జిల్లాలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, రెండు రోజుల క్రితం ఓ గ్రామంపై వరద నీరు విరుచుకుపడింది. అదే గ్రామంలోని 24 ఏళ్ల యువకుడు, ప్రాణాలకు తెగించి, తన తల్లిని, తోబుట్టువులను ఒక్కొక్కరినీ జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి చేర్చాడు.

చివరిగా మిగిలిన తండ్రిని రక్షించే క్రమంలో వరద పోటు మరింతగా పెరిగింది. తండ్రిని జాగ్రత్తగా తీసుకెళ్లి, ఓ చెట్టును ఎక్కిస్తున్న క్రమంలో, వరద నీరు మరింతగా రావడంతో పట్టుతప్పి నీటిలో కొట్టుకుపోయాడా యువకుడు. ఆపై అతని కోసం గాలించగా, చెట్ల మధ్య విగతజీవిగా కనిపించాడు. తామందరినీ రక్షించి, తమ కుమారుడు మరణించడాన్ని చూసిన ఆ తండ్రి గుండెలవిసేలా ఏడుస్తుంటే, అతన్ని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.

More Telugu News