Telangana: మహిళ ఒకరే, భర్తలు వేర్వేరు... తెలంగాణ ప్రభుత్వ పేపర్ ప్రకటనలపై బాధిత మహిళ ఆగ్రహం!

  • తెలుగు పేపర్లలో ఓ భర్త, ఇంగ్లీష్ పేపర్లలో మరో భర్త
  • తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన బాధితురాలు పద్మ
  • ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన అధికారుల వ్యవహారం

తన అనుమతి లేకుండా, తెలంగాణ ప్రభుత్వ ప్రకటనల్లో తన భర్తగా వేరొకరిని చూపడాన్ని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగ్రాయికి చెందిన మహిళ పద్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కంటివెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ సర్కారు పేపర్లలో ప్రకటనలు ఇచ్చిన వేళ, కొన్ని ప్రకటనల్లో పద్మ భర్తగా ఒకరిని, మరికొన్ని ప్రకటనల్లో ఇంకొకరిని చూపించారు. తన భర్త ఫొటోను మార్చడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం యాదగిరి సమీపంలోని కొంగవల్లిలో ఉంటున్న తమ వద్దకు వచ్చి మూడు సంవత్సరాల క్రితం కొందరు ఫొటోలు తీసుకున్నారని ఆమె గుర్తు చేసుకుంది.

ఆపై తాము కాపుసారా కాచుకుని, దాన్ని తాగేవాళ్లమని, ఇప్పుడు సారా కాయడం లేదని, ఆనందంగా ఉన్నామని చెబుతూ పేపర్లో ప్రకటన ఇచ్చారని, ఆ తరువాత రైతు బంధు పథకం పెట్టిన సమయంలో తమకు పొలం ఉందని, రూ. 4 వేలు ప్రభుత్వం నుంచి అందుకుని ఆనందంగా ఉన్నామని మరో ప్రకటన వేశారని తెలిపింది.

 కంటివెలుగు ప్రారంభం సమయంలో తన భర్త ఫొటో బదులు వేరొకరి ఫొటో పెట్టారని ఆమె ఆరోపించింది. దాన్ని చూసిన చాలామంది తమను గేలి చేసి మాట్లాడుతున్నారని విలపించిన ఆమె, తాను తలెత్తుకు తిరగలేకపోతున్నానని వాపోయింది. తమకు పొలం లేదని, అయినా చెక్కులిచ్చినట్టు చూపించారని, ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

More Telugu News