Andhra Pradesh: పూజలు చేయడానికి వచ్చి ఇల్లాలిపై కన్నేసిన మాంత్రికుడు.. భర్తకు మత్తుమందిచ్చి భార్యతో పరారీ!

  • కర్నూలు జిల్లా డోన్‌లో ఘటన
  • అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ
  • దయ్యాలను తరిమేస్తానని వచ్చిన మాంత్రికుడు

ఓ ఇంట్లో క్షుద్రపూజలు నిర్వహించేందుకు వచ్చిన మాంత్రికుడు ఆ కుటుంబంలో చిచ్చు రాజేశాడు. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. డోన్‌‌లోని కొండపేటకు చెందిన ఆటో డ్రైవర్ శ్రీనివాసులు భార్య లక్ష్మి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. విషయం తెలుసుకున్న రంగస్వామి అనే మాంత్రికుడు ఆ ఇంటికి వచ్చి ఇంట్లో దయ్యాలు, భూతాలు ఉన్నాయని క్షుద్రపూజలు చేస్తే ఆమె అనారోగ్యం నయమవుతుందని చెప్పాడు.

మాంత్రికుడి మాటలు నిజమేనని నమ్మిన శ్రీనివాసులు సరేనన్నాడు. చెప్పినట్టే ఇంట్లో క్షుద్రపూజలు చేసిన మాంత్రికుడు రంగస్వామి.. లక్ష్మిపై కన్నేశాడు. శ్రీనివాసులకు మత్తుమందు ఇచ్చాడు. అతడు అపస్మారక స్థితిలోకి చేరుకున్నాక లక్ష్మి, ఆమె కుమార్తెను తీసుకుని పరారయ్యాడు. కాసేపటికి మెలకువ వచ్చి చూసిన శ్రీనివాసులు ఇంట్లో భార్య, కుమార్తె కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

More Telugu News