Kerala: కేరళ ప్రజలకు ఊరట.. మరో నాలుగు రోజులు వర్షాల్లేవ్!

  • గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన వర్షాలు
  • భయం అక్కర్లేదన్న వాతావరణ శాఖ
  • ఊపిరి పీల్చుకున్న ప్రజలు

ప్రకృతి బీభత్సంతో చిగురుటాకులా వణుకుతున్న కేరళకు ఇది ఊరటనిచ్చే కబురే. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు పడే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం 9 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. గత రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పడుతుండడంతో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. ఇప్పుడు మరో నాలుగు రోజులు వానలు కురిసే అవకాశం లేదన్న వార్తలతో కేరళ వాసులు ఊపరి పీల్చుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వర్షాల ప్రభావం తగ్గుముఖం పడుతూ వస్తోందని ఐఎండీ అదనపు డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ తెలిపారు. కోజికోడ్ కన్నూరు, ఇడుక్కి జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గత కొన్ని రోజులుగా కేరళలో కనీవిని ఎరుగని రీతిలో వర్షాలు కురుస్తున్నాయి. వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతవగా, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. అళప్పుజ, త్రిసూర్, ఎర్నాకుళం జిల్లాల్లో లక్షలాది మంది సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఆర్మీ, నేవీ, కోస్టుగార్డు, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి.

More Telugu News