dil raju: 'గీతగోవిందం' సక్సెస్ మీట్ లో కేరళకు విరాళం ప్రకటించిన దిల్ రాజు

  • రూ. 10 లక్షల విరాళం ప్రకటించిన దిల్ రాజు
  • అల్లు అరవిందే నాకు స్ఫూర్తి అన్న టాప్ ప్రొడ్యూసర్
  • విజయ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగాడంటూ ప్రశంస

వరదలతో సర్వం కోల్పోయిన కేరళ వరద బాధితులకు ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు విరాళం ప్రకటించారు. రూ. 10 లక్షలు విరాళం ఇస్తున్నట్టు 'గీతగోవిందం' చిత్రం సక్సెస్ మీట్ వేదికపై నుంచి ఆయన ప్రకటించారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, బన్ని, ఎన్టీఆర్, ప్రభాస్ తదితర హీరోలు విరాళాలను ప్రకటించారని... అందరూ కూడా తమ వంతు విరాళాన్ని అందించి కేరళను ఆదుకోవాలని కోరారు.

అల్లు అరవింద్ ను తాను దాదాపు 15 ఏళ్ల నుంచి చూస్తున్నానని... ఆయనే తనకు స్ఫూర్తి అని చెప్పారు. 'ఆర్య' సినిమా తీస్తున్నప్పుడు బన్నీవాసు తన వద్దకు వచ్చి, 'అన్నా పాలకొల్లులో నాకొక థియేటర్ కావాలి అని అడిగాడు. థియేటర్ ఎందుకు... మొత్తం పశ్చిమగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూషన్ తీసుకో అని చెప్పా. 40 రూపాయల అడ్వాన్స్ ఇచ్చి... ఈ 15 ఏళ్లలో ఇప్పుడు నా స్థాయికి ఎదిగాడు' అంటూ కితాబిచ్చారు.

ఈ 15 ఏళ్లలో ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, రామ్ చరణ్ అందరూ స్టార్లు అయ్యారని... 20 ఏళ్ల క్రితం 'తొలిప్రేమ' సినిమాతో యూత్ ను పవన్ కల్యాణ్ షేక్ చేశారని... ఇప్పుడు తనకు విజయ దేవరకొండ అలా కనిపిస్తున్నాడని దిల్ రాజు అన్నారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగాడని... చిరంజీవిలాంటి వారి ఆశీస్సులు విజయ్ కు ఉన్నాయని చెప్పారు.

More Telugu News