kangana ranaut: బ్రోకరేజ్ ఇవ్వలేదంటూ.. హీరోయిన్ కంగనా రనౌత్ పై కేసు నమోదు

  • ముంబైలో రూ. 20.07 కోట్లతో ఇళ్లు కొన్న కంగన
  • బ్రోకరేజ్ డబ్బులు చెల్లించలేదంటూ ప్రకాశ్ అనే వ్యక్తి ఫిర్యాదు
  • మొత్తం చెల్లించేశామంటున్న కంగన ప్రతినిధులు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై పోలీసు కేసు నమోదైంది. కేసు వివరాల్లోకి వెళ్తే, ముంబైలోని పాలీహిల్ లో గత ఏడాది ఆమె రూ. 20.07 కోట్లు పెట్టి ఓ ఇల్లు కొంది. అయితే ఒప్పందం ప్రకారం తనకు చెల్లించాల్సిన బ్రోకరేజ్ ను చెల్లించలేదంటూ ముంబైలోని ఖర్ పోలీస్ స్టేషన్ లో కంగన, ఆమె సోదరి రంగోలిలపై ప్రకాశ్ జీ రోహిర అనే బ్రోకర్ ఫిర్యాదు చేశాడు. ఇల్లు కొనడానికి తాను మధ్యవర్తిగా వ్యవహరించానని... తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని కంగన ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

దీనిపై కంగన ప్రతినిధులు స్పందిస్తూ... ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన 1 శాతం (రూ. 20 లక్షలు) చెల్లించామని... కానీ ఇప్పుడు ఆయన 2  శాతాన్ని డిమాండ్ చేస్తున్నాడని చెప్పారు. నగదు చెల్లించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.

క్రిష్ దర్శకత్వం వహిస్తున్న 'మణికర్ణిక' చిత్రంలో ప్రస్తుతం కంగన నటిస్తోంది. వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్రతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు.

More Telugu News