Tamilnadu: పుట్టిన బిడ్డను చూసి పులకించి... ఆసుపత్రిలోనే ప్రియురాలికి తాళి కట్టిన ప్రియుడు!

  • ప్రేమను కలిపిన పేగు బంధం
  • తమిళనాడు వేలూరు సమీపంలో ఘటన
  • బిడ్డను చూసి వెంటనే తాళికట్టిన యువకుడు

ప్రేమను పేగు బంధం కలిపింది. పెళ్లికి నిరాకరించిన ఆ యువకుడు, పుట్టిన బిడ్డను చూసి పులకించిపోయాడు. వెంటనే పెళ్లికి అంగీకరించాడు. ఈ ఘటన తమిళనాడులోని వేలూరు సమీపంలో జరిగింది. రెండేళ్లుగా రాజ్యలక్ష్మి (20)తో ప్రేమలో ఉన్న హరి (22), ఆమెను గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకుందామని రాజ్యలక్ష్మి కోరితే ససేమిరా అన్నాడు. తన ఇంట్లో ఒప్పుకోవడం లేదని చెప్పాడు. దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది.

మరోపక్క, నెలలు నిండడంతో శుక్రవారం నాడు వాలాజాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న హరి, ఆసుపత్రికి వెళ్లాడు. శుక్రవారం నాడు మహాలక్ష్మి పుట్టిందని సంబరపడ్డాడు. వెంటనే మనసు మార్చుకుని రాజ్యలక్ష్మిని పెళ్లాడతానని చెప్పాడు. ఆసుపత్రి ప్రవేశద్వారం వద్దే కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఆమె మెడలో తాళికట్టాడు. మంచి నిర్ణయం తీసుకున్నావని హరిని పలువురు అభినందించారు.

More Telugu News