Yadadri Bhuvanagiri District: యాదగిరిగుట్టలో మళ్లీ మొదలైన వ్యభిచారం!

  • గత మూడు వారాలుగా ఇళ్లకు తాళాలు వేసి పరారీ
  • గుట్టకు తిరిగి వచ్చిన వ్యభిచార నిర్వాహకులు
  • దాడులు చేసి ఏడుగురు బాలికలకు విముక్తినిచ్చిన పోలీసులు

చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి తెచ్చి, వారికి హార్మోనుల ఇంజక్షన్లు ఇచ్చి త్వరగా పెరిగేలా చేస్తున్న కొందరు దుర్మార్గులు, వారిని వ్యభిచారకూపంలోకి దించుతున్నారని, దశాబ్దాలుగా యాదగిరిగుట్టలో ఈ దందా సాగుతోందని వచ్చిన వార్త గత నెలలో తెలుగురాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. పోలీసులు వరుస దాడులు చేసి, పలువురు అమ్మాయిలను రక్షించారు కూడా. పోలీసుల దాడులకు భయపడి పట్టణాన్ని వదిలి పారిపోయిన వ్యభిచార నిర్వాహక కుటుంబాలు, పరిస్థితి కొంత సద్దుమణగగానే, తిరిగి వచ్చి, మళ్లీ అదే పని మొదలుపెట్టాయి.

ఈ విషయాన్ని  గురించి ఉప్పందుకున్న పోలీసులు, నిన్న దాడులు చేసి మరో ఏడుగురు బాలికలను రక్షించి, పలువురిని అరెస్ట్ చేశారు. వీరంతా గత రెండు మూడు వారాలుగా ఇళ్లకు తాళాలు వేసి పారిపోయిన వారేనని, దాడులు ఆగాయని తెలుసుకుని వెనక్కు వచ్చారని పోలీసు అధికారులు వెల్లడించారు. కొంతమంది పోలీసు అధికారుల సహకారంతోనే వీరు తిరిగి వచ్చారని, దాడులు ఇకపై ఉండవని వారి నుంచి హామీ రావడంతో తమ దందాను తిరిగి మొదలు పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. కాగా, నిన్న పోలీసులు కాపాడిన ఏడుగురు అమ్మాయిలూ పదేళ్లలోపు వయసున్నవారే కావడం గమనార్హం. వీరిలో నాలుగేళ్ల పాప కూడా ఉంది.

More Telugu News