Yogi Adityanath: దివంగతనేతకు యూపీలో స్మారక కేంద్రాల ఏర్పాటు

  • మహానేత వాజ్‌పేయికి నివాళిగా యోగి సంచలన నిర్ణయం
  • యూపీలో నాలుగు స్మారకకేంద్రాల ఏర్పాటు 
  • వాజ్‌పేయి చితాభస్మం యూపీలోని 75 జిల్లాల ప్రధాననదుల్లో నిమజ్జనం

మాజీ ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి జ్ఞాపకాలను ప్రజల మదిలో పదిలంగా ఉంచాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాజ్‌పేయి చితాభస్మాన్ని యూపీలోని మొత్తం 75 జిల్లాల వ్యాప్తంగా ప్రధాన నదుల్లో నిమజ్జనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దివంగత నేతకు నివాళిగా మరో సంచలన నిర్ణయం తీసుకున్న యోగి ప్రభుత్వం నాలుగు చోట్ల వాజ్‌పేయి గౌరవార్థం స్మారక కేంద్రాలు నిర్మించనుంది.

ఆగ్రాలోని వాజ్‌పేయి పూర్వీకుల గ్రామం బటేశ్వర్‌తో పాటు, ఆయన తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన బలరామ్‌ పూర్‌లోను, వాజ్‌పేయి రాజీనీతి శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్ చేసిన కాన్పూర్‌లోను, రికార్డు స్థాయిలో ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికైన లక్నో నగరంలోను నాలుగు స్మారకాలను నిర్మించాలని యూపి ప్రభుత్వం భావిస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ మహానేత వాజ్‌పేయికు నివాళిగా ఎప్పటికీ గుర్తుండేలా ఈ ఆలోచన చేసి స్మారకకేంద్రాల నిర్మాణానికి సంకల్పించినట్టు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి.  

More Telugu News