Cricket: వీధుల్లో హార్దిక్ పాండ్యా షికారు.. చీవాట్లు పెట్టిన భారత అభిమానులు!

  • ఫొటో షేర్ చేసిన పాండ్యా
  • ఘాటుగా స్పందించిన భారత అభిమానులు
  • ఆట మీద దృష్టి పెట్టాలని క్లాస్

ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచుల్లో భారత క్రికెట్ జట్టు చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు మండిపడ్డారు. క్రికెట్ ప్రాక్టీస్ చేయకుండా వీధుల్లో ఈ తిరుగుడు ఏంటని చీవాట్లు పెట్టారు.

భారత జట్టు ఇంగ్లండ్ తో మూడో టెస్ట్ ఆడేందుకు నాటింగ్ హమ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ కు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడికి షికారుకెళ్లిన హార్దిక్ ఆ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. 'ఈ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్నా' అని ట్యాగ్ కూడా తగిలించాడు. దీంతో అభిమానులకు తిక్కరేగింది. అసలే రెండు టెస్టుల్లో చెత్త ప్రదర్శన చేసిన హార్ధిక్ పై ఫైర్ అయ్యారు.

‘బీసీసీఐ డబ్బుతో నీ జీవితంలో మొదటి, చివరి యూకే టూర్ ను బాగా ఎంజాయ్ చేయ్’ అని ఓ నెటిజన్ విమర్శించగా, సోకులపై కాదు ఆటపై దృష్టి పెట్టాలని మరొకరు సూచించారు. మరికొందరైతే.. అక్కడ క్రికెట్ ఆడటానికి వెళ్లావా? లేక ఎంజాయ్ చేయడానికి వెళ్లావా? అని హార్దిక్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ రోజు ట్రెండ్ బ్రిడ్జ్ లో ఇంగ్లండ్ తో భారత్ మూడో టెస్ట్ ఆడనుంది.

More Telugu News