wife: 'నన్ను పట్టించుకోకుండా ఫోన్లో కబుర్లేంటి?' అంటూ భార్య చెవి కోసేసిన భర్త!

  • తమిళనాడులో దారుణం
  • ఇంటికొచ్చినా పట్టించుకోని భార్య
  • బాధితురాలి ఫిర్యాదుతో భర్త అరెస్ట్

సెల్ ఫోన్లు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి అంటే ఇదేనేమో. తాను ఎన్నిసార్లు నచ్చజెప్పినా వినకుండా భార్య ఫోన్ లోనే మాట్లాడుతున్నందుకు ఆగ్రహించిన ఓ భర్త, ఆమె చెవిని కోసేశాడు. తమిళనాడులోని  సేలం జిల్లాలో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సేలంలో ముత్తురాజా(40), ఆయన భార్య సంధ్య(40) ఎడప్పాటి పెరుమాళ్గుడి ప్రాంతంలో ఉంటున్నారు. ముత్తురాజా ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా, సంధ్య ప్రైవేటు స్కూల్ లో అసిస్టెంట్ హెడ్మాస్టర్ గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో సంధ్య ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడుతూ గడిపేది. భర్తను పట్టించుకునేది కాదు. దీంతో పద్ధతి మార్చుకోవాలని ఆమెను పలుమార్లు ముత్తురాజా హెచ్చరించాడు. అయినా ఆమె సీరియస్ గా తీసుకోలేదు.

ఈ నేపథ్యంలో గురువారం రాత్రి పనినుంచి ఇంటికొచ్చిన ముత్తురాజాను పట్టించుకోని సంధ్య ఫోన్ సంభాషణల్లో మునిగిపోయింది. తాను వచ్చినా పట్టించుకోకపోవడం, ఫోన్ లో నవ్వుతూ మాట్లాడటంతో ఆగ్రహానికి లోనైన ముత్తురాజా కత్తిపీటతో సంధ్య కుడిచెవిని కోసి పారేశాడు. దీంతో బాధితురాలు గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్నవారు అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో ముత్తురాజాను పోలీసులు అరెస్ట్ చేశారు.

More Telugu News