Cricket: జట్టు మేనేజ్ మెంట్ ఆదేశిస్తే టెస్టుల్లో కూడా ఓపెనింగ్ చేస్తా!: రోహిత్ శర్మ

  • ఇంగ్లాండ్ తో జరిగే మూడో టెస్ట్ మ్యాచ్ లో పుంజుకునే అవకాశం వుంది 
  • మ్యాచ్ లో రాణించటానికి నిరంతరం కష్టపడతా 
  • అసలు వన్డేల్లో ఓపెనింగ్ అవకాశం వస్తుందని అనుకోలేదు  

వన్డేల్లోనే కాకుండా టెస్టుల్లో కూడా ఓపెనింగ్ చేయడానికి సిద్ధమంటున్నాడు రోహిత్ శర్మ. ఇంగ్లాండుతో జరుగుతున్న టెస్ట్ సీరీస్ లో టీం ఇండియా వరుసగా ఫెయిల్ అవుతున్న నేపధ్యంలో, జట్టు మేనేజ్‌మెంట్‌ ఆదేశిస్తే టెస్టుల్లో కూడా ఓపెనింగ్ చేస్తానని చెప్పాడు.  

ప్రస్తుతం ఇంగ్లాండ్ తో రేపు మూడో టెస్ట్ సీరీస్ ఉన్న నేపధ్యంలో ఓపెనర్ గా అవకాశం కల్పిస్తే కచ్చితంగా చేస్తానని అన్నాడు. ఇప్పటివరకు ఓపెనర్లుగా ఉన్న మురళీ విజయ్‌, కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌ విఫలమవుతున్న సమయంలో  
టెస్టు క్రికెట్‌లో జట్టు మేనేజ్‌మెంట్‌ ఓపెనింగ్‌ చేయమంటే తానెప్పుడూ సిద్ధమేనని, టెస్ట్ లో రాణించటానికి నిరంతరం శిక్షణ పొందుతున్నానని చెప్పాడు.

ప్రస్తుతం టీమిండియాకు అండగా నిలబడాల్సిన సమయమిది అని చెప్పిన రోహిత్ శర్మ, దక్షిణాఫ్రికాలోనూ తాము తొలి మ్యాచ్‌ ఓడిపోయినా తర్వాత రెండు మ్యాచుల్లోనూ రాణించామని, ఇంగ్లాండ్‌లోనూ టీమిండియా పుంజుకునే అవకాశాలున్నాయన్నాని చెప్పాడు.

   ‘టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసినప్పుడు ఓపెనింగ్‌ అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కాలక్రమంలో అది వచ్చింది. ఇప్పుడు  టెస్ట్ సీరీస్ లో అవకాశం వస్తే దానిని స్వాగతిస్తా. నేనెప్పుడూ జట్టులో ఉండాలనుకుంటా. కానీ అది నా చేతుల్లో లేదు' అన్నాడు రోహిత్. మరి మేనేజ్ మెంట్ ఈ ఆటగాడికి ఆ అవకాశం ఇస్తుందేమో చూద్దాం!

More Telugu News