Andhra Pradesh: గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించండి: ఏపీ సీఎస్

  • విద్యాశాఖ అధికారులకు ఆదేశం 
  • పనితీరు ఆధారంగా ఆయా కళాశాలలను ర్యాంకింగ్
  • ప్రముఖ విద్యా సంస్థలతో అనుసంధానం చేయాలి

రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని, ఏఒక్క విద్యార్ధి మధ్యలో చదువు మానివేయకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ దినేష్ కుమార్ ఈరోజు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈమేరకు అమరావతి సచివాలయంలో కళాశాల విద్య, ఉన్నత విద్యతో పాటు సాంకేతిక విద్యపై ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లోను తప్పనిసరిగా సురక్షితమైన తాగునీరును అందించడంతో పాటు విద్యుత్ సౌకర్యాన్ని ప్రభుత్వ పరంగా పూర్తిగా అందుబాటులో ఉంచాలని, వీటి కల్పన విషయంలో ఎలాంటి ధాతలపై ఆధారపడవద్దని స్పష్టం చేశారు.

వివిధ పాఠశాలలు, కళాశాలల్లో డ్రాప్ అవుట్ రేట్ ను పూర్తిగా తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. కళాశాల్లలోని మౌలిక సదుపాయలు, వాటి పనితీరు ఆధారంగా ఆయా కళాశాలలను గ్రేడింగ్ చేసి ర్యాంకింగ్ లు ఇవ్వడం ద్వారా ఉత్తమ విద్యాసంస్థల్లో ఎక్కువ మంది చేరేలా విద్యార్ధులను ప్రోత్సహించవచ్చని తెలిపారు. సైన్స్ కోర్సులకు తగిన విధంగా లాబొరేటరీ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలని అప్పుడే ఆయా కోర్సులను సమర్ధవంతంగా నిర్వహించేందుకు వీలవుతుందని, ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.

పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటిఐలలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించే నూతన కోర్సులను ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఉందని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ ను సీఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. విద్యార్ధులకు వచ్చే వినూత్న ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు వీలుగా ఇన్నోవేషన్ కేంద్రాలు దోహదపడేలా వాటిని అన్ని విధాలా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. అంతేగాక ప్రముఖ విద్యాసంస్థలతో అనుసంధానం చేయడం ద్వారా విద్యార్ధులకు మంచి ఎక్స్ పోజర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

More Telugu News