Jagan: వాజ్ పేయి మృతిపై వైఎస్ జగన్ స్పందన!

  • రాజకీయాల్లో ఓ శకం ముగిసింది
  • విభేదించే వారికీ ఆయన ఆమోదయోగ్యుడు
  • విలువల పరంగా శిఖర సమానుడని వ్యాఖ్య

భారతదేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని, అటల్‌ బిహారీ వాజ్‌ పేయి మరణం పట్ల ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారతరత్న వాజ్‌ పేయి మరణించారన్న వార్త తనను ఎంతగానో బాధించిందని జగన్ వ్యాఖ్యానించారు. ఆయన మృతితో భారత రాజకీయాల్లో ఓ శకం ముగిసినట్టయిందని పేర్కొన్నారు.

విభేదించే రాజకీయ పార్టీల వారికి కూడా ఆమోదయోగ్యుడిగా, అద్భుతమైన, ఆకట్టుకునే వక్తగా, కవిగా వాజ్ పేయి నిలిచారని గుర్తు చేశారు. రాజకీయ విలువలూ, మర్యాదల పరంగా ఆయన శిఖర సమానుడని, విదేశీ దౌత్య దురంధరుడని, పార్లమెంటరీ సంప్రదాయాల పరంగా మహోన్నతుడని పేర్కొన్నారు. అందరి మన్ననలూ పొందిన వాజ్ పేయి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఓ ప్రకటన ద్వారా జగన్ తెలియజేశారు.

More Telugu News