Kabul: కాబూల్‌లో దారుణం: క్లాస్ రూములో ఆత్మాహుతి దాడి.. 48 మంది విద్యార్థుల దుర్మరణం!

  • కోచింగ్ సెంటర్‌లో ఆత్మాహుతి దాడి
  • ప్రాంగణమంతా మాంసం ముద్దలు, తెగిపడిన అవయవాలు 
  • ఐఎస్ఐఎస్ పనేనని అనుమానం

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో దారుణం జరిగింది. క్లాస్ రూములో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఏకంగా 48 విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. రక్తపు మడుగులో మాంసం ముద్దలు, తెగిపడిన అవయవాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. తీవ్రంగా గాయపడిన మరో 67 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన విడుదల చేయలేదు.

బుధవారం సాయంత్రం నాలుగు గంటల వేళ కాబూల్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. పీజీ ప్రవేశ పరీక్షకు కోచింగ్ తీసుకునేందుకు పెద్ద ఎత్తున వచ్చిన విద్యార్థులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. విద్యార్థులతో సందడిగా ఉన్న భవనంలోకి ఓ ఆత్మాహుతిదళ సభ్యుడు ప్రవేశించి తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో క్షణాల్లోనే ఆ ప్రాంతం భీతావహంగా మారిపోయింది. ఎటుచూసినా తెగిపడిన విద్యార్థుల అవయవాలు, మాంసం ముద్దలే. బాధితుల ఆర్తనాదాలతో హృదయవిదారకంగా మారింది. కొందరు ఏం జరుగుతోందో తెలియక ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటన వెనక ఐసిస్ హస్తం ఉండచ్చని ప్రభుత్వం అనుమానిస్తోంది.

More Telugu News