Andhra Pradesh: ఎమ్మెల్యే ‘మేడా’ తండ్రి కారులోంచి రూ.50 లక్షలు మాయం.. ఎత్తుకెళ్లిన కారు డ్రైవర్!

  • భోజనానికి వెళ్లొచ్చేసరికి డబ్బుతో డ్రైవర్ పరారీ
  • కర్నూలులో ఘటన
  • నిందితుడి కోసం పోలీసుల గాలింపు

కారులోని సొమ్ముకు కాపలాగా డ్రైవర్‌ను ఉంచి భోజనానికి వెళితే వాటిని పట్టుకుని అతడు పరారయ్యాడు. కర్నూలులో జరిగిందీ ఘటన. కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ నుంచి రాజంపేట బయలుదేరారు. ఆకలిగా ఉండడంతో కర్నూలు రాగానే రాజ్‌ విహార్ హోటల్‌లో భోజనం చేసేందుకు ఆగారు. అయితే, కారులో రూ.50 లక్షల నగదు ఉండడంతో వాటికి కాపలాగా డ్రైవర్‌ను ఉంచి రామకృష్ణారెడ్డి భోజనానికి వెళ్లారు.

ఇదే అదనుగా భావించిన డ్రైవర్ కారులో ఉన్న డబ్బులతో పరారయ్యాడు. భోజనం చేసి బయటకు వచ్చిన రామకృష్ణారెడ్డి.. డ్రైవర్, నగదు కనిపించకపోవడంతో హతాశులయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోటల్‌కు వచ్చి సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

More Telugu News