India: మేం రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయబోం: తేల్చి చెప్పిన ప్రధాని మోదీ

  • టీమిండియా స్వప్నం సాకారం కోసం కృషి
  • దేశవ్యాప్తంగా జీఎస్టీని అమలు చేసి చూపాం
  • రూ. లక్ష కోట్ల  పెట్టుబడికి దేశాన్ని అనుకూలంగా తీర్చిదిద్దాం

రాజకీయ ప్రయోజనాల కోసం తాము పనిచేయబోమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ  స్పష్టం చేశారు. ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేసిన అనంతరం మోదీ మాట్లాడుతూ.. తాము దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తాం తప్పితే రాజకీయ ప్రయోజనాల కోసం కాదని తేల్చి చెప్పారు. టీమిండియా స్వప్నం సాకారమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇంటింటికి మరుగుదొడ్డిని నిర్మించాలన్న స్వప్నాన్ని సాకారం చేశామని పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని అందరూ అడుగుతున్నారని, కానీ తాము మాత్రం రైతు పెడుతున్న పెట్టుబడిలో ఒకటిన్నర రెట్లు అధికంగా ఆదాయం తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వివరించారు.

ప్రతీ గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించాలన్న తమ లక్ష్యం సాకారమవుతోందని మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ను అమలు చేసి చూపించామన్నారు. కోట్లాదిమంది చిన్న వ్యాపారుల సహకారంతో జీఎస్టీ విజయవంతం అయిందని కొనియాడారు. దివాలా బిల్లు, బినామీ ఆస్తుల బిల్లులతో అక్రమార్కుల భరతం పడుతున్నట్టు మోదీ పేర్కొన్నారు. ఇవాళ ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందన్నారు. ఆర్థికవేత్తలు, పలు సంస్థలు భారత్‌లో అభివృద్ధిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయన్నారు. గతంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడేవారని, ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులకు దేశాన్ని అనుకూల ప్రాంతంగా మార్చినట్టు వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో ముందడుగు వేసినట్టు ప్రధాని పేర్కొన్నారు.

More Telugu News