Andhra Pradesh: ఏపీలో మూడు స్పోర్ట్స్ సిటీలు ఏర్పాటు చేస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

  • అమరావతి, విశాఖ, తిరుపతిలో ఏర్పాటు చేస్తాం
  • త్వరలో 10 వేల స్పోర్ట్సు కిట్ల పంపిణీ
  • రాష్ట్ర ఒలింపిక్ సంఘం ఎన్నికలకు రెడీ

ఏపీలోని అమరావతి, విశాఖ, తిరుపతి నగరాల్లో స్పోర్ట్స్ సిటీస్ నెలకొల్పనున్నట్లు రాష్ట్ర యువజన, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సచివాలయంలో ఈరోజు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే విశాఖలో 150 ఎకరాలను గుర్తించామని,  రాష్ట్రంలో 10 స్పోర్ట్స్ అకాడమీలను ఏర్పాటు చేశామని అన్నారు. వాటిలో 4 వాటర్ స్పోర్ట్స్ అకాడమీలు ఉన్నాయని అన్నారు.

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని, ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, మండల కేంద్రాల్లోనూ ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాలను నెలకొల్పుతున్నట్టు చెప్పారు.

మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేకు చెందిన సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో 100 సెంటర్లు నెలకొల్పామని, వాటి ద్వారా లక్షా 25 వేల మంది విద్యార్థులకు వివిధ అథ్లెటిక్స్ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. వారిలో ఉత్తమ నైపుణ్యం కనబర్చిన వారిని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో అంతర్జాతీయ కోచ్ లతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, 2020 నాటికి ఒలింపిక్స్ లో ఏపీకి చెందిన క్రీడాకారులు పతకాలు సాధించేలా ప్రత్యేక కార్యచరణ రూపొందించినట్టు తెలిపారు.

స్పోర్ట్స్ కోడ్ బిల్లు అమలు చేయాల్సిందే

సీనియర్ ఐఏఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఒలింపిక్ సంఘం అసోసియేషన్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కొల్లు రవీంద్ర తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో స్పోర్ట్స్ అసోసియేషన్లన్నీ వచ్చే నెల 15 వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వ స్పోర్ట్సు కోడ్ బిల్లు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ కోడ్ బిల్లు అమలు చేయని అసోసియేషన్లకు ప్రభుత్వమందించే సహాయ సహకారాలు నిలిపేస్తామని, గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు.

త్వరలో 10 వేల స్పోర్ట్స్ కిట్లు అందజేయనున్నట్టు చెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మండలాల్లో ఉన్న ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాలు, పాఠశాలల క్రీడా మైదానాలు అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. గతంలో పాఠశాలలో ఉన్న క్రీడా మైదానాల అభివృద్ధికి రూ.5 లక్షలు ఇవ్వగా, ప్రస్తుతం దాన్ని రూ.7.50 లక్షలకు పెంచామని, స్థల సదుపాయాలున్న చోట్ల 20 లక్షల రూపాయలతో అథ్లెటిక్ ట్రాక్ ను నెలకొల్పనున్నట్టు పేర్కొన్నారు.

రూ.73 లక్షలతో నియోజక వర్గ కేంద్రంలో, రూ.23 లక్షలతో మండల కేంద్రంలో ఉన్న ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రంలో మౌలిక వసతులు కల్పించనున్నామని, ఏపీలో క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, దీనిలో భాగంగా గ్రామదర్శినిలో 35 ఏళ్ల లోపు ఉన్నవారికి వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నామని, గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో గెలుపొందిన వారికి రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని అన్నారు.

8 లక్షల మందికి శిక్షణ...1.50 లక్షల మందికి ఉపాధి

రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ కింద ఈ ఏడాది 8 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్నామని, వారిలో లక్షా 50 వేల మందికి ప్లేస్ మెంట్ కల్పించాలనే లక్ష్యం పెట్టుకున్నట్టు కొల్లు రవీంద్ర తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ ఏర్పాటైన నాటి నుంచి 6.50 లక్షల మందికి వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చామని, వారిలో లక్షా 46 మందికి ప్లేస్ మెంట్ కల్పించామని వివరించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఉపాధి అంశాలపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 425 సాంఘిక, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఉన్న లక్షా 54 మంది విద్యార్థులకు నైపుణ్య వికాసం పేరుతో శిక్షణ అందజేస్తున్నామని, అమెజాన్, ఆటో డెస్క్, గూగుల్ వంటి ప్రైవేటు సంస్థలతో కలిసి ఇండస్ట్రీస్ సర్టిఫికెట్ కోర్సులను ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు.

ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ కోర్సులను బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, దుబాయ్, ఖతార్ వంటి దేశాల సాయంతో నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో 40 సీమెన్స్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. వాటి ద్వారా డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు ప్రత్యేకమైన శిక్షణ అందజేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. డసాల్ట్ సిస్టమ్ తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భాగంగా 3 సెక్టార్లలో 84 కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని, ఈ ఏడాది లక్ష మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో విస్తృతంగా పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని, వాటిలో యువతకు ఉద్యోగాల కల్పనకు సదరు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్టు చెప్పారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఐటీఐల ఆధునికీకరణకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వాటిలో ఆధునిక పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయనుందని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, యువతకు వ్యవసాయంలో నైపుణ్య శిక్షణకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఏపీని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రవీంద్ర తెలిపారు.

More Telugu News