Facebook: కొత్తగా వివాహమైన యువతికి షాకిచ్చిన ఫేస్ బుక్ పోస్టులు... ఆట కట్టించిన సైబర్ క్రైమ్ పోలీసులు!

  • ఫేస్ బుక్ లో ఫొటోలు పెడితే అసభ్య కామెంట్స్
  • కుటుంబంతో ఉన్న వివాదం నేపథ్యంలో మేనమామ దుర్మార్గం
  • అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు

తనకు నచ్చిన వరుడిని ఆనందంగా పెళ్లి చేసుకుంది. ఆ మధుర క్షణాలను తన మిత్రులతో పంచుకోవాలని భావించి సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో పంచుకుంది. ఎంతో మంది లైక్స్ కొడుతూ, శుభాకాంక్షలు చెప్పగా, కొన్ని ప్రొఫైల్స్ నుంచి "ఇలా ఎంతమందిని పెళ్లి చేసుకుంటావు?", "ఎంతమందితో ఇప్పటివరకూ గడిపావు?" అంటూ షాకింగ్ కామెంట్స్ రాగా, తీవ్ర మనస్తాపంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఆ పోస్టుల వెనకున్న అసలు కథను బయట పెట్టారు.

బెంగళూరు పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, లికిత్ రెడ్డి అనే ఫేస్ బుక్ ప్రొఫైల్ నుంచి యువతికి అసభ్య మెసేజ్ లు, తిట్లు వచ్చాయి. వాటిని చూసి ఆమె కన్నీరుమున్నీరైంది. తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుతూ వస్తున్న కామెంట్లు ఆగకపోయేసరికి పోలీసులను ఆశ్రయించింది. విచారణ ప్రారంభించిన పోలీసులు ఆ ప్రొఫైల్స్ ఫేక్ వని తేల్చారు. వారి అసలు ఉద్దేశం తెలుసుకోవాలని విచారిస్తే, అవన్నీ ఒకే ఐపీ అడ్రస్ పై సృష్టించినట్టు తెలుసుకుని నిందితుడు ఒకడేనని తేల్చారు. సదరు ఇంటర్ నెట్ కనెక్షన్ రిజిస్టర్ అయిన ఐపీ నంబర్ కనుక్కోగా, నిందితుడు ఎవరో తెలిసిపోయింది.

బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులతో పాటు, బాధిత యువతి కూడా షాక్ తింది. అతను ఎవరో కాదు... యువతికి స్వయానా మేనమామ. ఆమె కుటుంబానికి, అతని కుటుంబానికి మధ్య గత కొంత కాలంగా వివాదం ఉండటంతో, ఆమె కాపురంలో నిప్పులు పోయాలన్న ఉద్దేశంతో ఈ పని చేశాడు. ఆమె వైవాహిక జీవితాన్ని నాశనం చేయాలని చూసిన ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు పంపారు.

More Telugu News